iDreamPost
android-app
ios-app

బాలిక ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత కోవర్ట్ అంట.. వర్ల వింత వాదన

  • Published Jan 31, 2022 | 2:22 AM Updated Updated Jan 31, 2022 | 2:22 AM
బాలిక ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత కోవర్ట్ అంట.. వర్ల  వింత వాదన

విజయవాడ భవానీపురంలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలోనూ తెలుగుదేశం పార్టీ రాజకీయం వెతుకుతోంది. సందర్భం ఏదైనా తమకు కావాల్సింది రాజకీయమే అని ఈ దుర్ఘటనపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య స్పందించిన తీరు తేటతెల్లం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఆమె ఆత్మహత్యకు కారకుడైన వినోద్‌ జైన్‌ టీడీపీ ముసుగులో ఉన్న వైఎస్సార్‌ సీపీ కోవర్ట్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ విషయం పాతబస్తీలో అందరికీ తెలుసునని అన్నారు. బాలిక ఆత్మహత్య ఘటనపై ఆయన ఆదివారం రాత్రి స్పందించారు. నిందితుడు వినోద్‌ జైన్‌ దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కి సన్నిహితుడని వ్యాఖ్యానించి ఈ విషాద సందర్భంలో సైతం రాజకీయ నాయకుడిలాగే వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

బాలిక ఆత్మహత్య చేసుకున్నాక కోవర్ట్‌ అని తెలిసిందా?

వినోద్‌ జైన్‌ 2021లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 37వ డివిజన్‌ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు   వినోద్‌ జైన్‌ తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అతను ఈ ఘటన జరిగే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఈ ఘటనలో అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశాక టీడీపీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించింది. సడన్‌గా వర్ల రామయ్య అతను వైఎస్సార్‌ సీపీ కోవర్ట్‌ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయం పాతబస్తీలో అందరికీ తెలుసునని చెబుతున్న వర్లకు మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకున్నాక వినోద్‌ జైన్‌ వైఎస్సార్‌ సీపీ కోవర్ట్‌ అని తెలిసిందా? ఇన్నాళ్లూ కోవర్ట్‌ ఆపరేషన్‌ చేసి టీడీపీకి ఏం నష్టం చేశాడు? వైఎస్సార్‌ సీపీకి ఏం ప్రయోజనం చేకూర్చాడు? ఒక కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడినవాడు కోవర్ట్‌ ఆపరేషన్‌ చేసి ఏం సాధిస్తాడు? ఎవరికి ఉపయోగిస్తాడు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తప్పు చేశాక ఏ పార్టీ వాడైతే ఏంటి?

13 ఏళ్ల బాలిక రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురై మరణిస్తే గతంలో పోలీసు అధికారిగా కూడా పనిచేసిన టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తప్పు చేసినవాడిది ఏ పార్టీ? ఏ నాయకుడికి సన్నిహితుడు వంటి అంశాలకు మించి ఆలోచించలేకపోవడం శోచనీయం. ఈ పాపాన్ని అధికార పక్షం ఖాతాలో వేసేసి, జనం దృష్టిలో ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌ సీపీని దోషులుగా నిలబెట్టేద్దామనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడం విచారకరం. మొదట ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. బాధిత కుటుంబాన్ని ఓదార్చాలి. ఇటువంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించాలి.

ఒక బాధ్యతగల ప్రతిపక్షంగా ఇటువంటివేమీ చేయకుండా అతను వైఎస్సార్‌ సీపీ కోవర్ట్‌ అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెల్లుబికుతున్న జనాగ్రహాన్ని అధికార పక్షంపైకి నెట్టేయాలనుకోవడం దిగజారుడు రాజకీయం కాదా? అసలు తప్పు చేసినవాడు ఏ పార్టీ అయితే ఏంటి? శిక్ష పడాలి అంతే. ఒకరు తప్పు చేసినంత మాత్రాన అది మొత్తం పార్టీకి ఆపాదించేసి, ఆ పార్టీని జనం ఈసడించుకోరు కదా? అతన్ని తప్పు చేయమని జగన్‌మోహన్‌రెడ్డో,  చంద్రబాబునాయుడో చెప్పరు కదా? ఎందుకు ప్రతిదానికి భుజాలు తడుముకోవడం? ప్రతిదానిలో రాజకీయం జొప్పించడం? దిగజారిపోయి వ్యవహరించడం. ఇలాంటి ఘటనల్లో కూడా రాజకీయాలు మాట్లాడితే జనం ఈసడించుకుంటారన్న సంగతి గ్రహించకపోతే ఎలా అని వర్ల వైఖరిని వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Also Read : టీడీపీ నేత‌ వేధింపులు బాలిక ఆత్మహత్య