Idream media
Idream media
ఆపత్కాకంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ తీరు కరెక్టేనా..? ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడు తరచూ వార్తల్లో అయితే ఉంటున్నారు, అది ఎవరికి ఉపయోగపడుతుంది..? కరోనా మహమ్మారి పంజాతో ప్రజలు విలవిలలాడుతున్న సమయాన ఇదే అనువైన సమయం అని ప్రభుత్వాన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ, చంద్రబాబు వాగ్దాటి పెరుగుతున్న మాట వాస్తవమే. ఆయన నోట వస్తున్న మాటల్లో అత్యధికంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేవిగానే ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా ఆయనపై నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉధృతిని అవకాశంగా చేసుకుని ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు కానీ, ఎక్కడా పార్టీ తరఫున కానీ, వ్యక్తిగతంగా కానీ ప్రజలకు సహకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం చంద్రబాబునాయుడు జూమ్ లో ప్రత్యక్షం అవుతున్నారు. ఆయా ఘటనలను తనకు అనువుగా మార్చుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, అందుకే కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసేశారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు, ఇంటికే టోకెన్ల పంపిణీ వంటి ప్రజలకు సులభతరమైన విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకే తాత్కాలికంగా వ్యాక్సినేషన్ ను ప్రభుత్వం నిలిపిన విషయం తెలిసిందే. ఇది జరిగి గంటలు కూడా గడవక ముందే, ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ చర్యలపైనా, కేంద్రానికి లేఖలు రాయడాన్ని తప్పుబడుతున్న చంద్రబాబు తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రయత్నించకూడదు.. కేంద్రానికి అనేక లేఖలు రాశారు కదా.. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ ఎందుకు లేఖ రాయరు? అని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలపై కూడా అవును మరి.. మీరే నిత్యం సమీక్షలు, సమావేశాలు జరుపుతూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అమ్మ క్యాంటీన్లు కొనసాగించాలని తీసుకొన్న నిర్ణయం అభినందనీయమని ఏపీలోనూ అన్న క్యాంటీన్లను ఇప్పటికైనా తెరవాలని సూచించారు. అయితే.. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను గుర్తిస్తున్నట్లుగా ఉంది. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే మంచి చాన్స్… కానియ్యండి, కానియ్యండి సార్.. అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా విమర్శలకే పరిమితమా, ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించేది లేదా అని ప్రశ్నిస్తున్నారు.