iDreamPost
android-app
ios-app

వన్డే సిరీస్‌ ను కూడా వదులుకున్నారు..రెండవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

  • Published Jan 22, 2022 | 2:53 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
వన్డే సిరీస్‌ ను కూడా వదులుకున్నారు..రెండవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

సఫారీ గడ్డపై భారత్‌ జట్టు టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను సైతం వదులుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండవ వన్డేలో కూడా ఓటమి పాలైంది. వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. ఇప్పటి వరకు బ్యాటింగ్‌ వైఫల్యంతో టెస్టులు, వన్డేలలో ఓటమి చవిచూసిన భారత్‌ ఈసారి బౌలర్ల వైఫల్యంతో కీలకమైన మ్యాచ్‌ను కోల్పోయింది. రెండవ వన్డేను దక్షిణాఫ్రికా జట్టు ఏడువికెట్ల తేడాతో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాలోని బోలాన్డ్‌ పార్కులో రెండవ వన్డే మ్యాచ్‌ శుక్రవారం జరిగింది. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరువికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోర్‌కు అలవోకగా ఛేదించింది. 48.1 ఒక ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజేతగా నిలిచింది.

ఓపెనర్లు చేలరేగి ఆడడంతో దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్‌ మలాన్‌ 91 పరుగులు చేసి ఔట్‌కాగా, మరో ఓపెనర్‌ డీ కాక్‌ 78 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 132 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. రెండవ వికెట్‌కు మలాన్‌, బవుమా కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్‌ 212 పరుగుల వద్ద ఉండగా మలాన్‌ ఔట్‌కాగా, 214 వద్ద బవుమా 35 పరుగులకు అవుటయ్యారు. ఒకేసారి రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై భారత్‌ జట్టుకు ఆశలురేకెత్తాయి. అయితే మార్కరమ్‌, దుసాన్‌లు భారత్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా జట్టును విజయం పైపు తీసుకుని వెళ్లారు. మార్కరమ్‌, దుసాన్‌లు చెరో 37 పరుగులు చేశారు. వికెట్లు పడగొట్టే విషయంలో భారత్‌ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. బుమ్రా ఒక్కడే కొంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత జట్టులో శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌లు విఫలమైనప్పటికీ జట్టు పంత్‌, రాహుల్, ఠాకూర్‌లు రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. ధావన్‌ 29 పరుగులు మాత్రమే చేయగా, కోహ్లీ సున్నా పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్‌ రాహుల్ 55 పరుగులు, పంత్‌ 85, ఠాకూర్‌లు 40 పరుగులు (నాటౌట్‌)గా నిలిచాడు. వీరితోపాటు ఎస్‌.అయ్యర్ 11, వి.అయ్యర్‌ 22, అశ్విన్‌ 25 పరుగులు చేయడంతో భారత్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది.