Idream media
Idream media
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ప్రస్తుతాన్ని ప్రభుత్వాన్ని కుదిపేలా వరుస వివాదాలు, ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు వారాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల మధ్య సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ చర్చల నడుమ ప్రభుత్వం, సంస్థాగత మార్పులతో పాటు నాయకత్వం మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే ఈ ఊహగానాల్లో ఏదీ నిజం కాలేదని అన్నీ వదంతులే అని కేంద్ర పెద్దల నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టత ఇవ్వడంతో వాటికి బ్రేక్ పడింది. ఇంతలోనే మరో వివాదం యోగికి తలనొప్పిగా మారింది. ఫేక్ ట్వీట్ల స్కాం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది.
ఆశిష్ భార్య ట్వీట్ తో వివాదం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి యోగి ఆదిత్యానాథ్కు అనుకూలంగా ట్వీట్లు వేయాలని, అందుకోసం ఒక పోస్ట్కి 2 రూపాయల చొప్పున చెల్లిస్తామంటూ ఈమధ్య 70 సెకండ్ల నిడివి ఉన్న ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఫేక్ అడియో క్లిప్గా చెబుతున్న కాన్ఫూర్ పోలీసులు.. ఈ వ్యవహారంలో అనుమానితులుగా అశిష్ పాండే అనే వ్యక్తిని, మరొకరిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్ అని పేర్కొంటూ అశిష్ భార్య, బీజేపీ నేత డాక్టర్ ప్రీతి ట్వీట్ చేయడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది.
‘అయ్యా యోగిగారు..’ అంటూ మొదలుపెట్టి హిందీలో ఆమె ఒక ట్వీట్ చేసింది. తన భర్త అరెస్టు అక్రమమని, ఆయన నాలుగేళ్లుగా మీ(యోగి) పాలనను నా భర్త గౌరవిస్తున్నాడు. ఇది ఆయన ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమని, దయచేసి ఆయన్ని కలిసే అవకాశం ఇప్పించాలని, తన భర్త తరపు వాదనను బలంగా వినిపించే అవకాశం తనకు దొరుకుతుందని ఆమె ట్వీట్ చేసింది. కాగా, ప్రీతి బీజేపీ ఎన్జీవో విభాగం కో ఆర్డినేటర్తో పాటు యూపీ బాలల హక్కుల విభాగంలో సభ్యురాలు కూడా.
లోకల్ మీడియా వార్తల కలకలం
ఇక కాన్పూర్ పోలీసులు మాత్రం అశిష్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కంపెనీ నడిపిస్తున్నాడని, ఫోర్జరీ, ఛీటింగ్ కేసుల కింద అతన్ని అరెస్ట్ చేశామని చెబుతున్నారు. మరోవైపు లోకల్ మీడియా ఛానెల్స్.. అశిష్, హిమాన్షు సైని అనే ఇద్దరూ సీఎంవో, సీఎం యోగిలకు అనుకూల ట్యాగులతో చాలాకాలంగా పోస్టులు పెడుతున్నారనే విషయం వెలుగులోకి తెచ్చాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించకపోవడం విశేషం.
మరోవైపు యోగి సర్కార్పై తరచూ విరుచుకుపడే ఐఎఎస్ మాజీ అధికారి సూర్య ప్రతాప్ సింగ్ 70 సెకండ్ల ఆడియో క్లిప్ను వైరల్ చేయడంతో.. ఈ వ్యవహారంపై ప్రముఖంగా దృష్టి పెట్టింది అక్కడి మీడియా. అయితే ఫేక్ ఆడియో క్లిప్ వైరల్ చేసినందుకు సూర్య ప్రతాప్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.