iDreamPost
android-app
ios-app

ఫోన్.. రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోందిగా..!

ఫోన్.. రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోందిగా..!

అర‌చేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్ ఒక్కోసారి అంద‌రినీ హ‌డ‌లెత్తిస్తోంది కూడా. అంతేకాదు.. రాజ‌కీయాల‌నే షేక్ చేస్తోంది. ఎంద‌రో నేత‌ల‌ను రాజ‌కీయాల‌కు దూరం చేసింది. కర్ణాటకలో ఓ మంత్రి కామక్రీడల వీడియో ఎంత హ‌ల్ చ‌ల్ చేసిందో తెలిసిందే. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డం కార‌ణం ఫోనే.

ఇప్పుడు తాజాగా పెగాసస్ స్పైవేర్ తో పలువురు ప్రముఖలపై నిఘా పెట్టారనే వార్తలు భారత్ తోపాటు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార పార్టీపై ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి దేశంలోని ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఫోన్లను హ్యాక్ చేశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. అందుకు ఆయుధం కూడా పోనే.

స్మార్ట్ ఫోన్ జ‌న జీవితంలో భాగ‌మైంది. అలాంటి ఫోన్ చుట్టూ రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వేడి పుట్టించ‌డానికి ప్ర‌ముఖుల‌లో ఫోన్ ల‌లో పెగాస‌స్ సాఫ్ట్ వేర్ చొప్పించార‌న్న ఆరోప‌ణలే కార‌ణం. దేశంలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు ఇలా 300 మంది ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన ఓ కథనం సంచనలంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దేశంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రల్లోనూ సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు ఫోన్లు కేంద్రంగా మారాయి.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసులో సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అధికార జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు రఘురామ డబ్బులు తీసుకున్నారని దాని వెనక రెండు తెలుగు ఛానెళ్లతో పాటు టీడీపీ హస్తం ఉందని ఆ అఫిడవిట్లో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో ఇంత ధైర్యంగా అఫిడవిట్లో ఈ విషయాలు పేర్కొనడం వెనక తగిన ఆధారాలున్నాయని స్పష్టమవుతోంది. అందుకు రఘురామ ఫోన్లోని సమాచారమే కారణమని తెలుస్తోంది.

అరెస్ట్ చేసినపుడు ఈ ఫోన్ కోసమే సీఐడీ పోలీసులు తనను కొట్టారని రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన మొబైల్లో కీలకమైన సమాచారం ఉంది కాబట్టే ఫోన్ ఇవ్వడానికి ఎంపీ మొదట ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ ఫోన్లో ఆర్థిక లావాదేవీలతో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్తో జరిపిన వాట్సప్ ఎస్ఎంఎస్ మెసేజులు ఉన్నాయని వెలుగులోకి వ‌చ్చింది.మరోవైపు మీడియా యాజమాన్యాలతో నడిపిన బేరసారాలు కూడా ఇందులోనే ఉన్నాయని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ఆధారంగానే ఏపీ అఫిడవిట్ దాఖలు చేసిందనే స్పష్టంగా అర్థమవుతోంది.

ఇటు తెలంగాణలోనూ పెగాసస్ వ్యవహారం వేడి పెంచుతోంది. గతంలో కేసీఆర్ తన ఫోన్ హ్యాక్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తాజాగా ఆరోపించారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్లోనే ఉండి టీఆర్ఎస్ పార్టీ తరపున తనకు టికెట్ వస్తుందని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా మొత్తంగా అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలకు ఫోన్లే కారణమయ్యాయి.