Idream media
Idream media
జగన్ మేనియా పుణ్యమా అని చక్కగా ఎంపీ అయిపోయారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిపోవడం మాని తనకు తానే చేటు తెచ్చుకున్నారు. చివరకు జైలు పాలయ్యారు. ఆయన ఎవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఆ.. ఆయనే రఘురామకృష్ణంరాజు. రాజకీయాల్లో ఏళ్ల తరబడి ప్రయత్నిస్తే కానీ ఫేమ్ రాదు. వచ్చిన దానిని నిలబెట్టుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణం. రఘురామ రాజుకు ఆ లక్షణం లేదని తేలిపోయింది. వైసీపీతో ప్రయాణం మొదలు పెట్టి, సీటు ఇవ్వలేదనే కోపంతో.. ఆ తర్వాత బీజేపీలో చేరి, కొన్నాళ్లకు టీడీపీ పంచన చేరి.. ఫైనల్ గా 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి లోక్ సభ టికెట్ సంపాదించి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీలు మారినా చివరకు జగన్ ఇమేజ్ తో గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. కానీ, స్వయంకృతాపరాథం ఆయన్ను జైలుపాలు చేసింది.
టీడీపీ జనాలు రెచ్చగొట్టారా, బీజేపీ నాయకులు ఎగదోశారా అనేది అప్రస్తుతం. రఘురామ మాత్రం రెచ్చిపోయారు, విజ్ఞత వదిలేసి విచ్చలవిడిగా ప్రవర్తించారు. తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారు. సీఎం జగన్ ని విమర్శించేవారు, దెప్పిపొడిచేవారు, ఆయనంటే గిట్టనివారు ఏపీ రాజకీయాల్లో చాలామందే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇంత దారుణమైన కామెంట్లు చేసిన వ్యక్తిని ఎక్కడా చూసి ఉండం. ఒక పార్టీలో ఉంటూ, ఆ పార్టీ గుర్తుపై గెలిచి, అదే పార్టీ అధినేతను తిట్టారు రఘురామ. రేపు మరో పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడిని కూడా తిట్టరని గ్యారెంటీ ఏంటి..? రఘురామకృష్ణంరాజుని చేరదీయాలనుకునే వారెవరైనా ఇదే విషయాన్ని కచ్చితంగా ఆలోచిస్తారు.
“దిగజారుడు అనేది జారుడు బండలాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎవరో రెచ్చగొడితే, ఈలవేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే ఉంటుంది, స్వయంకృతానికి బాధ్యులుండరు.” అంటూ ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు పరిస్థితిని చక్కగా వర్ణించారు విజయసాయిరెడ్డి. రచ్చబండ పేరిట రకరకాల ఆరోపణలు చేయడమే కాదు, రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణంరాజు. చివకు ఆ సామాజిక వర్గానికి కూడా వ్యతిరేకి అయిపోయారు. ఆయనకు తరగని ఆస్తి ఉంది. అంతులేని వ్యాపారాలున్నాయి. కానీ ఏం లాభం, పరువు పోయింది. రేపు మరో రాజకీయ పార్టీలో చేరితే, ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే.. ఆయన కించపరిచిన కులంవాళ్లు ఒక్కరైనా ఓటు వేస్తారా? అసలు ఆయనను ఏ పార్టీలో అయినా చేర్చుకుంటారా? అనేది భవిష్యత్తే చెప్పాలి.