iDreamPost
iDreamPost
పృథ్వీషా గురించి ఒక జోక్ ఉంది. అర్ధరాత్రి నిద్రలేపినా, ఫస్ట్ బాల్ కి ఫోరే కొడతాడంట. అది అతని ఆటతీరు. ఆ దూకుడే రంజీ చరిత్రలోనే అరుదైన ఫీట్ చేయించింది. రంజీ ట్రోపీ 2022 సీజన్లో ముంబై, యూపీ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ముంబై జట్టుదే. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై కెప్టెన్ పృథ్వీ షా మొదటి బాల్ నుంచే దంచికొట్టడం మొదలుపెట్టాడు. మరో ఓపెనర్… హార్డ్ హిట్టర్ యశస్వి జైశ్వాల్. పృథ్వీ 71 బంతుల్లో 12 ఫోర్లతో 64 పరుగులకు ఔటయ్యాడు. అప్పుడు జట్టు స్కోర్ 66. మరో ఓపెనర్ జైశ్వాల్ స్కోరు (0). తొలి వికెట్ కి ఓపెనర్లు 66 పరుగులు చేస్తే.. అందులో పృథ్వీ షావే 64 పరుగులు. మరో రెండు పరుగులు ఎక్స్ట్రాలు. అంటే తొలివికెట్ భాగస్వామ్యంలో 96.96 శాతం పరుగులు పృథ్వీ షావే. వావ్.
తొలి వికెట్కు 50 ప్లస్ స్కోరులో ఒకరిదే స్కోరు మొత్తం ఉండడం ఫస్ట్క్లాస్ చరిత్రలో ఇది రెండోసారే. 1888లో ఆస్ట్రేలియా క్రికెట్లో ఈ అద్భుతం జరిగితే 134 ఏళ్ల అనంతరం పృథ్వీ షా-జైశ్వాల్ జోడి ఆ రికార్డును బద్దలు కొట్టింది. పృథ్వీ షా ఒకపక్క ధాటిగా ఆడుతున్నాడు. అలాగని జైశ్వాల్ కి స్ట్రైయిక్ అవకాశం రాలేదని కాదు. మొత్తం 52 బాల్స్ ఆడినా ఒక్క రన్ తీయలేదు. 55వ బాల్ కి కాని రన్ రాలేదు. అది బౌండరీ. అందుకే సరదాగా జైశ్వాల్ బ్యాట్ పైకి లేపితే, ప్రత్యర్థి ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు.