iDreamPost
android-app
ios-app

ఈట‌ల రాక‌ముందే పెద్దిరెడ్డి ప‌ర్య‌ట‌న‌లు : అయోమ‌యంలో హుజూరాబాద్ బీజేపీ

ఈట‌ల రాక‌ముందే పెద్దిరెడ్డి ప‌ర్య‌ట‌న‌లు : అయోమ‌యంలో హుజూరాబాద్ బీజేపీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవ‌లే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. హుజూరాబాద్ లో జ‌రిగే ఉప ఎన్నిక‌లో బీజేపీ నుంచి పోటీ చేస్తార‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నాయ‌కుడిగా మొద‌టి నుంచీ మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ఈటల రాకతో ఆయన ప్రాతినిద్యం మ‌స‌క‌బారే అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే మొద‌టి నుంచీ పెద్దిరెడ్డి ఈట‌ల రాక‌ను వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. అధిష్టానం క‌ల‌గ‌జేసుకుని పెద్దిరెడ్డికి న‌చ్చ‌చెప్పింది. మొద‌ట స‌సేమిరా అన్న ఆయ‌న బీజేపీ పెద్ద‌ల జోక్యంతో సైలెన్స్ అయ్యారు. కానీ, ఈట‌ల బీజేపీలో చేరి నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌ముందే పెద్దిరెడ్డి స్థానికంగా ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వ్వ‌డం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

రెండురోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దిరెడ్డి కార్యక్రమం రూపొందించుకోవడం బీజేపీలో చిచ్చు పెట్టింది. ఇటీవల కాలంలో కరోనాతో చనిపోయిన బీజేపీ నేతలు కార్యకర్తల పరామర్శల పేరుతో క్యాడర్ ను కలిసేందుకు పెద్ది రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బీజేపీ క్యాడర్ ను అంతా తనవైపు తిప్పుకునేలా.. ఈటలను దూరం పెట్టేలా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేడు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పర్యటన బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈటల రాజేందర్ కంటే ముందు రెండు సార్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పెద్ది రెడ్డి గెలిచాడు. ఈటల బీజేపీలో చేరితే మద్దతు ఇవ్వనని స్పష్టం చేశాడు. ఉప ఎన్నికల బరిలో ఉంటానని చెప్పిన పెద్దిరెడ్డి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరికతో హుజూరాబాద్ సీటుపై ఆ పార్టీలో పీటముడి నెలకొంది. ఇప్పటికే ఆ సీటుపై కన్నేసిన పెద్దిరెడ్డి దీనిపై నిరాశలో ఉన్నాడు.

ఇక హుజూరాబాద్ లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దీంతో బరిలో దిగేందుకు అవకాశం కోసం పెద్దిరెడ్డి చూస్తున్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకున్నా పోటీపై నియోజకవర్గ అనుచరులతో రాజకీయ భవిష్యత్ పై కీలక చర్చలు పెట్టారు. 15 రోజుల్లో కరీంనగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.