iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్పై ప్రజలకు మోజు తగ్గిందని, టీడీపీ వైపు చూస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయడంలేదని ఒక బండ అబద్దం ఆడేశారు.
అధికారంలో ఉన్నప్పుడే అంత సీన్ లేదు..
తమ సమస్యలు పరిష్కరిస్తుంది అన్న భరోసా లేక అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ వైపు జనం చూసేవారు కాదని, ఇప్పుడు ఎందుకు ఆ పార్టీ వైపు చూస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అధికారం సాధించడమే పరమాధిగా 630 హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని నెరవేర్చలేదు. ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో ఏకంగా పార్టీ వెబ్ సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోనే తొలగించి వారిని దారుణంగా మోసగించారు. మరోపక్క ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావించి 96 శాతం హామీలను జగన్మోహనరెడ్డి అమలు చేశారు. తాను హామీ ఇవ్వకపోయినా ప్రజల మేలు కోరి మరిన్ని సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.
నవరత్నాలు సైతం సరిగ్గా అమలుచేయడం లేదని చెబుతున్న రామ్మోహన్ నాయుడు సరిగా అంటే అర్థం ఏమిటో చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతుండడమే అందుకు నిదర్శనం అని చెబుతున్నారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పథకాలను రికార్డు స్థాయిలో అమలు చేస్తోంది. రెండున్నరేళ్ల వ్యవధిలో రూ. 1.21 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదని గుర్తుచేస్తున్నారు. నవరత్నాలు ఖచ్చితంగా అమలు చేస్తుండడంతో టీడీపీకి పుట్టగతులు ఉండవు అన్న భయంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
వాస్తవాలకు భిన్నంగా కామెంట్లు..
గ్రామ సచివాలయాలు సక్రమంగా పనిచేయటం లేదని, ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. అసలు రాష్ట్రంలో సంక్షేమ యజ్ఞం కొనసాగుతున్నదే గ్రామ సచివాలయాల కేంద్రంగా అన్నది అందరికీ తెలుసు. పాలనను ప్రజల ముంగిటకు చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తన మానస పుత్రికయిన సచివాలయాలు పకడ్బందీగా పనిచేసేలా తరచుగా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే చక్కటి పనితీరుతో అవి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే దీనికి పూర్తి భిన్నంగా మాట్లాడి రామ్మోహన్నాయుడు తనది కూడా సగటు టీడీపీ నేత స్థాయి అని నిరూపించుకున్నారు.
రాజీనామాలు మీరే చేయవచ్చు కదా?
ప్రత్యేకహోదాపై వైఎస్సార్ సీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని, రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని చెబుతున్న రామ్మోహన్ నాయుడు ఈ మాట చంద్రబాబును సంప్రదించే చెబుతున్నారా? ఎందుకంటే పదవులకు రాజీనామా చేసిన చరిత్ర టీడీపీకి లేదు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పడం కాకుండా అదేదో చేసి చూపాలని అధికార పార్టీ నేతలు సవాల్ చేస్తున్నారు. అప్పుడైనా ప్రత్యేకహోదా సాధనపై టీడీపీకి చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారని అంటున్నారు.
Also Read : రాజీనామా డిమాండ్ చేసే అర్హత టీడీపీకి ఉందా?