iDreamPost
android-app
ios-app

బీజేపీ ముఖ్య‌మంత్రుల‌కే ప్రాధాన్య‌మా?

బీజేపీ ముఖ్య‌మంత్రుల‌కే ప్రాధాన్య‌మా?

కరోనా రెండో ద‌శ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ప్ర‌ధాని మోదీ విప‌క్షాల విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్ర‌ధానంగా వ్యాక్సిన్ అందుబాటులో లేన‌ప్ప‌టి నుంచీ విమ‌ర్శ‌ల స్థాయి పెరిగింది. కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్ట‌ర్లు వెలిశాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు 25 మందిని అరెస్ట్‌ చేయడంతోపాటు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు కూడా. ఆ త‌ర్వాత మ‌మ్మ‌ల్ని కూడా అరెస్టు చేయండంటూ ప‌లువురు విప‌క్ష నేత‌లు నినాదాలు చేశారు. తాజాగా మ‌రో కొత్త ఆరోప‌ణ‌ల‌ను ప్రధాని ఎదుర్కొంటున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ లు, స‌దుపాయాల క‌ల్ప‌న‌లో బీజేపీ ముఖ్య‌మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా రాష్ట్రాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ప‌లువురు బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రులు ఆరోపిస్తున్నారు.

కోవిడ్‌ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా న్యాయాధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. తమతో మాట్లాడలేదని.. దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత. సమావేశం అనంతరం దీదీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు.. కానీ మాతో మాట్లాడలేదు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది అన్నారు. ఇది చాలా సాధారణ సమావేశంగా అనిపించింది’’ అన్నారు.

‘‘ప్రధాని ప్రవర్తించిన తీరు మమ్మల్ని అవమానించినట్లుగా అనిపించింది. ఆయన టీకాల గురించి కానీ, రెమ్‌డెసివర్‌, బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గురించి మాట్లాడలేదు. వ్యాక్సిన్‌ల కోసం డిమాండ్‌ చేయాలని భావించాం. కానీ మాకు మాట్లాడే అవకాశమే రాలేదు. గతంలో మాదిరిగానే ప్రధాని ఈ సారి కూడా కేసులు తగ్గుతున్నాయన్నారు. ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నారు. మేం చెప్పేది వినలేదు’’ అంటూ దీదీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌తో సహా మరో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలు పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియాలను ఆందోళన జిల్లాలుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. అయిన‌ప్ప‌టిక ఏం చేద్దామంటూ ప్ర‌ధాని త‌మ‌తో సంభాషించ‌లేద‌ని ఆరోపిస్తున్నారు.