iDreamPost

శిక్ష అమలయ్యేదెన్నడో…. ?

శిక్ష అమలయ్యేదెన్నడో…. ?

దేశంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. నేరస్తులు కూడా పట్టుబడుతున్నారు. కోర్టులు కొన్ని కేసులలో నిందితులకు శిక్షలు ఖరారు చేసినా ఆ ఖరారు చేసిన శిక్ష ఎప్పటికి అమలవుతుందో చెప్పలేని పరిస్థితి. మరికొన్ని సందర్భాల్లో శిక్ష ఎప్పటికి ఖరారు అవుతుందో చెప్పలేని పరిస్థితి. వాయిదాల మీద వాయిదాలు పడుతూ కొన్నేళ్ల పాటుగా కేసులు సా….గుతున్నాయి. అలాంటి కేసుల్లో శిక్షలు ఎప్పటికి ఖరారు అవుతాయో చెప్పలేని పరిస్థితి..

Read Also: వారంలోపు ఉరి తీయాలి

నిర్భయ కేసులో నిందితులకు శిక్ష ఖరారు అయి కొన్నేళ్లు దాటింది. కానీ నిందితులు పిటిషన్ల ద్వారా శిక్షను వాయిదా పడేలా చేస్తున్నారు. శిక్ష అమలవ్వబోతుంది అనే సమయానికి,శిక్ష అమలవకుండా ఏదొక పిటిషన్ వేస్తూ వాయిదా పడేలా చేస్తున్నారు. ఏదైనా నేరంలో ఒకరికన్నా ఎక్కువమంది నిందితులు పాలు పంచుకుంటే అందరికీ ఒకేసారి శిక్ష విధించాలి అన్న నిబంధన ఉండటం వల్ల నిర్భయ దోషులకు శిక్ష అమలు కావడంలో జాప్యం జరుగుతుంది.

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుడియా అత్యాచార ఘటన 2013లో జరిగితే, తుదితీర్పు ఈనెల 30 న వెలువడుతుందని తీర్పు వచ్చింది. ఇన్నేళ్ల విచారణ అనంతరం తుదితీర్పు కోర్టు వెల్లడించనుంది. తుదితీర్పు వెలువడిన తరువాత కూడా నిందితులు చట్టంలోని లొసుగుల్ని వాడుకుని శిక్షను తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం.

Read Also: గుడియా అత్యాచార ఘటనలో ఈ నెల 30న శిక్షలు ఖరారు

సమతా హత్యాచార ఘటనలో ఈనెల 30న తుదితీర్పును కోర్టువెల్లడించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో నిందితుడయినా శ్రీనివాసరెడ్డికి ఈరోజు శిక్ష ఖరారు కావాల్సి ఉండగా జడ్జిమెంట్ కాపీ రెడీ కాలేదని వచ్చేనెల 6 కి తుదితీర్పును వాయిదా వేశారు. మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేశాడన్న ఆరోపణలపై శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసారు. ఇలా చెప్పుకుంటు పొతే ఎన్నో కేసుల్లో తీర్పులు వాయిదా పడుతుండగా, మరికొన్ని కేసుల్లో శిక్షలు ఖరారు అయినా కూడా శిక్ష అమలు జరగడం లేదు.

Read Also: హాజీపూర్ వరుస హత్యల కేసులో తుది తీర్పు ఎప్పుడో తెలుసా ?

వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థ సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకుని చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకుంటూ కొందరు నిందితులు తమ తెలివితేటలతో కేసులు వాయిదా పడేలా, శిక్ష అమలులో జాప్యం చోటు చేసుకునేలా చేస్తున్నారు. నిర్భయ దోషులు తమకు పడిన ఉరి శిక్ష అమలుకు జాప్యం జరిగేలా తెలివిగా అనేక పిటిషన్లు వేస్తుండడంతో శిక్ష అమలుకు ఆలస్యం జరుగుతుంది. దీనిపై కేంద్ర హోం శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటే నిర్భయ దోషులు అవలంబిస్తున్న విధానాలతో ఎంతగా విసిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.. కాగా మన దేశంలో నేరాల విషయంలో చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థలో మార్పు వస్తుందా అంటే ఆలోచించాల్సిన విషయమే…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి