iDreamPost
android-app
ios-app

పాశ్వాన్ పార్టీలో చిచ్చుపెట్టిన బీహార్ ముఖ్యమంత్రి …?

పాశ్వాన్ పార్టీలో చిచ్చుపెట్టిన బీహార్ ముఖ్యమంత్రి …?

బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) లో ఏర్ప‌డిన చిచ్చు చివ‌ర‌కు పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. చిరాగ్ పాశ్వాన్ ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఎల్జేపీ పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌లైతే, ఇందుకు స్పందించిన చిరాగ్‌.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎవ‌రు ఎవ‌రిని స‌స్పెండ్ చేసిన‌ట్లో, ఎవ‌రి ఆదేశాలు చెల్ల‌తాయో తెలియ‌ని అయోమ‌యం ప‌రిస్థితి ఏర్ప‌డింది. జేడీయూకు, నితీశ్‌కుమార్ కు అధికారం ద‌క్క‌కుండా చేయ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన చిరాగ్.. ఇప్పుడు ఎల్పేజీలో ఈ చిచ్చు వెనుక జేడీయూ హ‌స్త‌ముంద‌ని ఆరోపిస్తున్నారు.

జాతీయాధ్యక్ష పదవి నుంచి తొల‌గించ‌డంపై ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ చట్టబద్ధ పోరాటానికి సిద్ధం అవుతుండ‌డంతో బాబాయ్ ప‌శుప‌తి కూడా అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడైన చిరాగ్‌ పాశ్వాన్‌, బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరాస్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్‌ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకోవడం.. ఈ విషయాన్ని స్పీకర్‌ ఓం బిర్లాకు తెలపడం.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి.

ఈ క్రమంలో చిరాగ్‌ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఎల్జేపీ ప్రకటన విడుదల చేయగా.. ఇందుకు స్పందించిన చిరాగ్‌.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా చిరాగ్‌ పాశ్వాన్ మాట్లాడుతూ ‘‘ఒకవేళ పశుపతి పరాస్‌ పార్లమెంటరీ నేతగా ఉంటానని నన్ను కోరితే ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం.

ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నిజానికి దీనంతటి వెనుక జేడీయూ హస్తం ఉంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణం. ఏదేమైనా నేను రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడిని. సింహం బిడ్డను. కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తాను’’అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ‘‘నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాబాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారు’’ అని చిరాగ్‌ భావోద్వేగానికి లోనయ్యారు.