iDreamPost
android-app
ios-app

ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజీ ఎవ‌రికి ఉప‌శ‌మ‌నం క‌లిగించింది..?

ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజీ ఎవ‌రికి ఉప‌శ‌మ‌నం క‌లిగించింది..?

ఆత్మ నిర్భర్ భారత్.. రూ.20 లక్షల కోట్లు.. ఆ వ్యాఖ్య‌లు వింటేనే చాతీ ఉప్పొంగుతుంది. ఏదో ఆశ చిగురిస్తుంది. క‌రోనా తెచ్చిన క‌ష్టాల నుంచి కాస్త‌యినా ఉప‌శ‌మ‌నం క‌లిగినంత ఫీలింగ్ వ‌చ్చేస్తోంది. కానీ, ఆ ప్యాకేజీ ఎంత మందికి ఉప‌శ‌మ‌నం క‌లిగించింది, దాన్ని ఉప‌యోగించుకుని మ‌నం, మ‌న చుట్టుప‌క్క‌ల ఎంత మంది పేద‌లు స్వాంత‌న పొందారు. ఎవ‌రికి ఆర్థిక ల‌బ్ధి క‌లిగింది అని ఎవ‌రినైనా సామాన్యుల‌ను ప‌రిశీలిస్తే.., ప్యాకేజీనా, 20 ల‌క్ష‌ల కోట్లా అని అవాక్క‌వ‌డం వారి వంతు అవుతోంది. ఆత్మ నిర్భ‌ర్ 2 పేరుతో మ‌రోసారి ప్యాకేజీకి కేంద్రం సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆత్మ నిర్భ‌ర్ ప్యాకేజీ 1 ఎంత వ‌ర‌కూ దోహ‌ద‌ప‌డింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

క‌రోనా మొద‌టి ద‌శ‌లో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో ఆర్థిక ఉద్దీపన ఉపశమన ప్యాకేజీ రూ. 20 లక్షల కోట్ల ను కేంద్రం ప్ర‌క‌టించింది. లాక్ డౌన్ సమాజానికి తీసుకువచ్చే వివిధ ఇబ్బందులను అధిగమించడానికి పేదలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ప్యాకేజీ ఇది. వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాల నుండి పేదలు, కార్మికులు మరియు వలస వచ్చినవారిని సాధికారపరచడంపై ప్రత్యేక ఆత్మనిర్భర్ భారత్- స్వావలంబన భారతదేశం యొక్క ఆర్థిక ప్యాకేజీ దృష్టి ఉంటుందని ప్ర‌ధాని మోదీ నాడు ప్ర‌క‌టించారు. ప్యాకేజీతో పాటు, భూమి, శ్రమ,ద్రవ్య మరియు చట్టాలు. ఇది పన్ను చెల్లించే మధ్యతరగతి మరియు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వంటి ప్రతి రంగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాకేజీ మొత్తం భారతదేశంలో దాదాపు 10%స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి). దేశీయ పౌరులు మరింత స్థానిక ఉత్పత్తులను ఉపయోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని ఆ సంద‌ర్భంగా ఆయన కోరారు. కానీ ప్ర‌తిజ్ఞ‌లు త‌ప్పా ఆ ప్యాకేజీ ప్ర‌యోజ‌నాలు చాలా మందికి అంద‌లేదు.

అయితే, ఇప్పుడు మ‌రో ఉద్దీప‌న ఉప‌శ‌మ‌న ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌కు కేంద్రం సిద్ధం అవుతోంది. దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్‌ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్‌ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్యాకేజీ కింద తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏవియేషన్‌, టూరిజం, ఆతిధ్యరంగాలను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే, కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత… జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఈ ఆత్మనిర్భర్‌ 2 ప్యాకేజీని ప్రకటిస్తారట‌.

ఆత్మ నిర్భ‌ర్ 1 అంటేనే ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌డం లేదు. నాడు ఎంతో మంది దీనికోసం తెలుసుకునేందుకు, ఆ ప్రయోజ‌నాలు పొందేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారతం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అన్ని రంగాల్లో మన దేశం ఇటీవల సాధించిన ఫలితాలే పునాదులుగా ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నామని.. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు నిర్మలా సీతారామన్‌. ఆర్థికంగా, మౌలిక స‌దుపాయాల ఇబ్బందులు లేకుండా, సాంకేతికత ను ఉప‌యోగించుకుంటూ ఎరిపైనా ఆధార‌ప‌డ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌యం ఆధారితంగా ఎదగడమే ఈ ప్యాకేజీ ఉద్దేశ్యమని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ ప్ర‌క‌ట‌న‌లు, ప్యాకేజీ ఉద్దేశాలు చాలా మందిని ఆక‌ర్షించాయి. కేంద్రం కూడా ఆర్భాటంగా దీన్ని ప్ర‌క‌టించింది. కానీ, ఈ ప్యాకేజీ ఎవ‌రికి దోహ‌ద‌ప‌డిందో, ఎంత మంది ఉప‌యోగ‌ప‌డిందో అనేది అంతుచిక్క‌ని ర‌హ‌స్యం. ఇప్పుడు మ‌రోసారి ఆత్మ నిర్భ‌ర్ 2 రాబోతోంది. మ‌రి ఇది ఏమ‌వుతుందో చూడాలి.

Also Read : పరీక్షల రద్దుపై అమిత్‌ షాకు లోకేష్‌ లేఖ..! షరతులు వర్తిస్తాయి..!!