Idream media
Idream media
దేశంలో కరోనా రెండో దశ కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రణాళికాలోపం, నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమంటూ ఆరోపిస్తున్నాయి. ఈ అంశంలో బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కేంద్రంపై ఒక్కసారిగా గురి పెడుతున్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుండడం, ప్రజలు పిట్టలా రాలుతుండటంపై.. గంగానదీ ప్రవాహంలో శవాల కుప్పలు కొట్టుకొస్తుండటంపై తాజాగా ఓ గుజరాతీ కవయిత్రి రాసిన కవిత సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆ కవయిత్రి తన కన్నీటినే సిరాగా చేసుకొని కలం ఝళిపించారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీయే కారణమని చెబుతూ ఆయన్ను ‘‘రామరాజ్యాన్నేలుతున్న నగ్న చక్రవర్తి’’గా అభివర్ణించారు. పవిత్రమైన గంగానది శవాల కుప్పతొట్టిగా మారిందని గుర్తుచేస్తూ ‘ఓ ప్రభూ.. మీ ఆదర్శ రాజ్యంలో గంగానది ఘోషను వింటున్నారా?’ అని మోదీని ఆమె ప్రశ్నించారు.
ఆ కవయిత్రి.. మోదీ పుట్టిన గడ్డ గుజరాత్ వాస్తవ్యురాలు.. పైగా ‘రానున్న కాలంలో గుజరాత్ కవితాజగత్తుకు ప్రతిరూపం’ అని ఒకప్పుడు సాక్షాత్తు బీజేపీ శ్రేణులు అభివర్ణించిన 51 ఏళ్ల పారుల్ ఖక్కర్! ‘శవవాహిని గంగ’ శీర్షికతో గుజరాతీ భాషలో ఆమె 14 పంక్తులతో కూడిన కవితను రాశారు.
దీన్ని ఈనెల 11న సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేశారు. అయితే వెంటనే దేశంలోని ఔత్సాహిక కవులు.. ఆమె కవితను అస్సామీ, హిందీ, ఇంగ్లిషు, తమిళం, భోజ్పూరి, మలయాళం, బెంగాలీ భాషల్లో అనువదించి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రతీలైనులో మోదీని ఉద్దేశించి ఓ ప్రభూ.. అని సంబోధిస్తూనే పరిస్థితిని కళ్లకు కట్టారు. ‘ఓ ప్రభూ.. ప్రతి ఇంట్లోనూ యముడు భీకర నృత్యం చేస్తున్నాడు. మా గాజులే కాదు.. గుండెలూ ముక్కలవుతున్నాయి’ వంటి ఆవేదనా పూరితమైన లైన్లు ఈ కవితలో ఉన్నాయి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న రాజు, ప్రజలను పట్టించుకోకపోవడంతో పేదరికంలో మగ్గుతున్నారని, నిస్సహాయులుగా ఉండిపోతున్నారని కవయిత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో మీడియా, విపక్షాలు.. వెన్నెముక లేకుండా, మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాయని చురకలంటించారు. కాగా ప్రసిద్ధ రచయిత మృణాల్ పాండే, నవనిర్మాణ్ ఆందోళన్ అధ్యక్షుడు మనిషి జానీ ఈ కవితను ప్రశంసించారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం పారుల్ ఖక్కర్పై భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెను తీవ్రపదజాలంతో దూషిస్తున్నాయి.