iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ నుంచి మళ్ళీ మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు. హిందీలో వచ్చినంతగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు కలిసి నటించడం లేదన్నది వాస్తవం. ఆ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాలా, ఊపిరి లాంటివి కొన్ని వచ్చాయి కానీ ఒకే జెనరేషన్ హీరోలు తెరమీద కనిపించడం అనేది అరుదుగా మారిపోయింది. అందుకే రాజమౌళి తీస్తున్న సినిమాటిక్ వండర్ మీద ఆ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ సీనియర్ హీరోలు చిరు బాలయ్య వెంకీ నాగ్ లలో ఏ ఇద్దరు కలిసి చేసినా కనులారా చూడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఎందరో. అయితే ఇది ఎప్పటికీ తీరని కోరిక అనుకోవాలమో.
వీటి సంగతి పక్కనపెడితే పోనీ వేర్వేరు జనరేషన్ల హీరోలు కలిసి నటించినా మంచి పరిణామమే అనుకోవాలి. తాజాగా అలాంటి ఓ కలయిక సాధ్యపడబోతోందనేది లేటెస్ట్ టాక్. యాంగ్రీ మ్యాన్ గా పేరొందిన రాజశేఖర్ మ్యాచో స్టార్ గోపీచంద్ కలయికలో శ్రీవాస్ దర్శకుడిగా ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తీసిన సాక్ష్యం డిజాస్టర్ తర్వాత శ్రీవాస్ చేసిన కొన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకు ముందు బాలయ్యతో చేసిన డిక్టేటర్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అందుకే ఈసారి ఓ డిఫరెంట్ సబ్జెక్టుని ప్లాన్ చేశారట.
ఓ కొత్త నిర్మాత పరిచయం కాబోతున్న ఈ మల్టీ స్టారర్ కు ఆ ఇద్దరు ప్రాధమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అఫీషియల్ గా ప్రకటించేదాకా ధృవీకరించలేం. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. గోపీచంద్ రాజశేఖర్ శ్రీవాస్ ముగ్గురికి ఇప్పుడు సక్సెస్ కొట్టడం చాలా అవసరం. గత కొంత కాలంగా ఈ త్రయానికి సరైన హిట్టు ఒక్కటీ లేదు. మార్కెట్ కూడా తగ్గింది. గోపీచంద్ సీటిమార్ విడుదలకు సిద్ధంగా ఉండగా రాజశేఖర్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో కరోనా వల్ల ఆగిపోయాయి. ఇవయ్యాక శ్రీవాస్ తో కమిట్ మెంట్ గురించిన క్లారిటీ రావొచ్చు. నిజమైతే మంచిదే