iDreamPost
android-app
ios-app

నోటిఫికేష‌న్ వెనుక అస‌లు ఉద్దేశం ఇదే..?

నోటిఫికేష‌న్ వెనుక అస‌లు ఉద్దేశం ఇదే..?

ఏపీ ఎన్నిక‌ల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ చ‌ర్య‌లు వివాదాస్ప‌దం అవుతూనే ఉన్నాయి. బ‌హుశా ఏ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కూడా ఇన్ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ఉండ‌రు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు చెప్పిన విధంగానే నిమ్మ‌గ‌డ్డ న‌డుస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. అందుకు ప‌లు కార‌ణాల‌ను వారు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో న‌డుస్తున్న బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం ఇళ్ల ప‌ట్టాల పంపిణీ. 30 ల‌క్ష‌ల మందికి పైగా పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇచ్చి ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఏడాది క్రిత‌మే సంక‌ల్పించింది. ఆ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా కో్ర్టు కేసుల ద్వారా టీడీపీ నాయ‌కులు అడ్డుత‌గులుతూ వ‌చ్చారు.

దానిపై కోర్టులోనే పోరాడిన అనంత‌రం ఇళ్ల స్థ‌లాల పంపిణీకి శ్రీ‌కారం చుట్టాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ వేచి చూసింది. అది మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతో సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి వివాదాలు లేని స్థ‌లాల పంపిణీకి శ్రీ‌కారం చుట్టారు. డిసెంబ‌ర్ 25న రాష్ట్రమంత‌టా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించారు.

ఇక అప్ప‌టి నుంచీ టీడీపీ నేత‌లు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు, ఆందోళ‌న‌ల‌తో అడ్డంకులు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ డిసెంబ‌ర్ 25 నుంచి ఏపీలో ప‌ట్టాల పండుగ కొన‌సాగుతోంది. దీంతో ల‌బ్దిదారుల ఆనందానికి హ‌ద్దుల్లేవు. అలాగే.. జ‌న‌వ‌రి 9న అంటే ఈ రోజు అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా త‌ల్లుల ఖాతాల్లో 15000 వేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ ఆకాశ‌మంతా ఎదుగుతూ ఉన్న క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ మ‌రో జీవో విడుద‌ల చేశారు. దీనిపై వైసీపీ నాయ‌కులు ఆరోప‌ణ‌లు కురిపిస్తున్నారు. కోర్టు ద్వారా అడ్డుకోలేక‌.. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించి.. ఎన్నిక‌ల కోడ్ తో ప‌ట్టాల పంపిణీ, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్ వేసేందుకే చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

మ‌రో జీవోపై విస్మ‌యం

ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు. ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై వర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్‌ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్‌ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపేయాలంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో స్పష్టంగా రాజకీయ అజెండా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల షెడ్యూల్ వెనుక అస‌ల ర‌హ‌స్యం ఇదేన‌ని ఆరోపిస్తున్నారు. ఏపీలో ఇద్ద‌రు వ్య‌క్తులు కుట్ర ప‌న్నుతున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. ఎన్నిక‌ల పేరుతో సంక్షేమానికి అడ్డుప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇళ్ల ప‌ట్టాల పంపిణీని అడ్డుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షాలు ఎన్ని కుట్ర‌లు చేసినా పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.