Idream media
Idream media
కరోనా విపత్తు సమయంలోనూ ఏపీలోని ప్రతిపక్షం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆపద్కాలంలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వాలకు సూచనలు చేయడం, లేదా నేరుగా ప్రజలకే సాయం చేసేలా కార్యక్రమాలు రూపొందించడం చేయాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ తీరు ఉంటోంది. ఇటువంటి సమయంలోనూ నిరసనలకు పిలుపునివ్వడంపై టీడీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు సీఎం జగన్ మాత్రం రాజకీయాలను, రాజకీయ విమర్శలను పట్టించుకోకుండా తన కర్తవ్య ధర్మంలో బిజీగా ఉంటున్నారు. వైరస్ పై చేయి సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా తాను చేయాల్సింది చేస్తూనే, కేంద్ర సహాయాన్ని పొందేలా నిరంతరం శ్రమిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఆన్లైన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యాక్సిన్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే నిమిత్తం ఈ నెల 8న, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. వ్యాక్సిన్ కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలు నిలపాలని కోరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరి ఇంటి వద్ద వారు ఉండి ఈ ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలని, కలెక్టర్లు, ఎమ్మార్వోలకు కూడా వినతిపత్రాలు పంపాలని నిశ్చయించారు. పాజిటివిటీ రేటు పెరుగుతున్నా, సీఎం కరోనాపై సమీక్షలు జరపడం లేదట. లాక్డౌన్ పెట్టి వైరస్ వ్యాప్తిని అరికట్టడం లేదట. వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని, వీటిపై ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు సాయం అందించాలని చెప్పకుండా ఇప్పుడు కూడా నిరసనలకే చంద్రబాబు పిలుపునివ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ తీరు ఇలా ఉంటే, కరోనా రెండో దశ కట్టడిని, వ్యాక్సినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తన రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం చర్యలు చేపడుతూనే ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఓ సందర్భంలో రికార్డు కూడా సృష్టించింది. కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ నిలిచిపోయినా, ఏపీలో మాత్రం కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన కొరతను అధిగమించేందుకు సుమారు 15 రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ మూడు సార్లు లేఖలు రాశారు. దాని ఫలితంగా ఏపీకి వ్యాక్సిన్ డోసులు వస్తూనే ఉన్నాయి.
మూడు రోజుల క్రితమే రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి వచ్చాయి. అనంతరం వాటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. అనంతర ఆయా జిల్లాలకు పంపించి ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా మరో 3.5 లక్షల డోసులు వచ్చాయి. కొద్ది రోజుల్లోనే మరో 9 లక్షల డోసులు వస్తున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు. 13 లక్షల డోసులు కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఇలా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ఏపీ సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పటికీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఇటువంటి సమయంలో కూడా రాజకీయాలు తగునా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.