iDreamPost
android-app
ios-app

మాజీ కార్మిక మంత్రి గుట్టు ర‌ట్టు.. పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌

మాజీ కార్మిక మంత్రి గుట్టు ర‌ట్టు.. పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌

అధికారంలో ఉన్న‌ప్పుడు కొంత మంది మంత్రులు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా ఉంటుంది. వారి సిఫార్సుల కోసం ఎంతో మంది మంత్రుల చుట్టూ తిరుగుతారు. ఇదే అదునుగా కొంద‌రు అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌తారు. ఉద్యోగాలు, ఇత‌ర ప‌నుల నిమిత్తం డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతుంటారు. అధికారంలో కోల్పోయాక అక్ర‌మాలు కొన్ని వెలుగులోకి వ‌చ్చి చిక్కుల్లో ప‌డ‌తారు. అన్నాడీఎంకే ప్ర‌భుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేసిన నిలోఫ‌ర్ ప‌రిస్థితి ఇప్పుడు ఆ కోవ‌కు చెందిన‌ట్లే ఉంది. ఉద్యోగాల పేరిట 104 మంది వద్ద డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆమె అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన అక్ర‌మాల‌కు, చేసిన వ‌సూళ్ల‌కు బాధితుల నుంచి ఇప్పుడు త‌న‌కు ఒత్తిళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొంటున్నారు.

త‌మిళ‌నాడులోని వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన నిలోఫర్‌ కఫిల్‌ గత కెబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఆమెకు అన్నాడీఎంకే సీటు ఇవ్వలేదు. రాష్ట్రంలో అధికారం మారడంతో మాజీ మంత్రి గుట్టును ఆమె వ్యక్తిగత కార్యదర్శి బయటపెట్టారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో నిలోఫర్‌ చేసిన అక్రమాల గురించి ఆమె వ్యక్తిగత కార్యదర్శి ప్రకాశం డీజీపీ కార్యాలయంలో లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన తనకు మంత్రి నుంచి అనేక సూచనలు, ఆదేశాలు రావడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే 104 మందికి ఉద్యోగ కల్పన విషయంగా నిలోఫర్‌ తనకు సూచనలు ఇచ్చారని, ఆ వ్యక్తులు ఇచ్చిన నగదును ఆమె తనయుడు, బంధువులకు తీసుకెళ్లి ఇచ్చానని తెలిపారు.

ఇలా రూ. 6.62 కోట్ల మేరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే గత ఏడాది కరోనా కాలం నుంచి ఉద్యోగాల కోసం సొమ్ములు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి వచ్చినా మంత్రి దాటవేస్తూ వచ్చారన్నారు. అధికారంలోకి మళ్లీ వస్తామని, చూసుకుందామని నచ్చ చెప్పారని, అయితే ఆమెకు ఈసారి సీటు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ 104 మంది తనపై ఒత్తిడి తెస్తున్నారని, తనకు సంబంధం లేని వ్యవహారంతో మానసిక ఒత్తిడి పెరిగిందని వాపోయారు. ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మంత్రిగా నిలోఫర్‌ చేసిన మోసాలను డీజీపీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బాధితులకు న్యాయం చేసి తనకు విముక్తి కలిగించాలని కోరారు. కాగా నిలోఫర్‌ కఫిల్‌ను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి ప్రకటన విడుదల చేశారు.

Also Read : క‌మ‌ల్ మ‌రీ అంత త‌ప్పు ఏం చేశారు..?