iDreamPost
android-app
ios-app

దేశంలో 75 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 75 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 3500 లకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,524 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 74,292కి చేరింది. కాగా కరోనా కారణంగా 2415 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 24,453 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 47,420 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 1026 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో 24,427 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా 921 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 14,947 దాటగా పుణెలో 2,937 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో నిన్న కొత్తగా 51 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి  1,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 472 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 822 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 32 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన కొన్ని రోజులతో పోలిస్తే నిన్న 33 కేసులు మాత్రమే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2,051కి మందికి కరోనా సోకగా 46 మంది మృత్యువాత పడ్డారు.1,056 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 949 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,342,354 మందికి కోవిడ్ 19 సోకగా 292,893 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,602,443 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,408,636 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 83,425 మంది మరణించారు.