Idream media
Idream media
కరోనా తొలి దశతో పాటు, మలి దశను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో దశ మొదలైతే కనుక ఎదుర్కొనేందుకు ముందస్తుగా సన్నద్ధం అవుతోంది. అత్యధిక గంటల కర్ఫ్యూ, ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ వంటి చర్యల ద్వారా రెండో దశ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 20 వేల వరకూ కరోనా కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు నాలుగైదు వేలకు పాజిటివిటీ పడిపోయింది. ఈ క్రమంలో ఎక్కడైతే అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారోనన్న అనుమానంతో అధికారులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మూడో దశకు కూడా సిద్ధంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకూ కరోనా కట్టడిలో ఏపీ దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మూడో దశపై కూడా ముందస్తుగా ఆలోచిస్తూ జగన్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. థర్డ్ వేవ్ మొత్తం చిన్నారులపైనే ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో ఏపీ సీఎం అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. తాజాగా కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు. ఏపీలో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు..చిన్నారులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. విశాఖ తిరుపతితోపాటు విజయవాడ-గుంటూరు లో మూడు కేర్ సెంటర్లు సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు.
థర్డ్ వేవ్ పై అనాలసిస్ డేటాను అధికారులు జగన్ కు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసేందుకు మూడు చోట్ల ఒక్కో కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తుందని భావించి అధికారులు సిద్ధం అవ్వాలని జగన్ ఆదేశించారు. పిల్లల్లో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ఆశా ఆరోగ్యకార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని.. మెడికల్ కాలేజీల్లో పిడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని జగన్ దిశానిర్ధేశం చేశారు. పీ.హెచ్.సీలు ఏరియా ఆస్పత్రులను పరిశీలించి పిల్లలకు చికిత్స అందించాలన్నారు.
థర్డ్ వేవ్ మొదలై ఒక్కసారిగా విజృంభించే పరిస్థితి వస్తే.. అప్పటికప్పుడు ఆందోళన పడే బదులు.. అప్పటి పరిస్థితిని ఇప్పుడే ఊహించుకుని సిద్ధంగా ఉండడం మంచిదే కదా అన్న అభిప్రాయాన్ని జగన్ వెలిబుచ్చారు. ముందుగానే పిల్లల కోసం నాణ్యమైన ఔషధాలను తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అవసరమైన మేరకు వైద్యులు సిబ్బందిని నియమించుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ ను సిద్ధం చేయాలని సూచించారు.