iDreamPost
android-app
ios-app

జగన్‌కు ఎలా సాధ్యమైంది..?

జగన్‌కు ఎలా సాధ్యమైంది..?

ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కల. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రభుత్వం ఉద్యోగంపై ఆశలు పెట్టుకోని వారు ఎవరూ ఉండరు. కానీ ఉద్యోగం సాధించాలంటే.. డబ్బు, విలువైన సమయం కేటాయించాలి. ఎంత డబ్బు..? ఎంత సమయం కేటాయించాలి..? అనేదే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ప్రతి ఒక్కరి మెదళ్లలో మెదిలే తొలి ప్రశ్న. నిన్న టి వరకు ఇది సమాధానం లేని ప్రశ్న. అందుకే చాలా మంది ఔత్సాహికులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనలను పక్కనపెట్టేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదో ఒక ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు అండగా ఉంటారు.

కానీ ఈ పరిస్థితి మారింది. ప్రభుత్వం.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తాయనే ప్రశ్నకు ఇప్పటి వరకూ ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి మారిపోతోంది. నోటిఫికేషన్ల కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆర్థిక ఏడాదిలో ఏ ఏ ఉద్యోగాలు..? ఎన్ని..? ఎప్పుడు భర్తీ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ.. జాబ్‌ క్యాలెండర్‌ను జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని అమలు చేసిన సీఎం జగన్‌.. తన విశ్వసనీయతను మరింత పెంచుకున్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు.

జాబ్‌ క్యాలెండర్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామనుకున్న వారికి ఇది ఓ సువర్ణ అవకాశం. నిర్ణీత సమయంలో పరీక్ష జరుగుతుంది కాబట్టి.. సమయం వృథా కాదు. ప్రయత్నం చేసి విజయం సాధిస్తే సంతోషం. లేదంటే.. తమకు నచ్చిన ఉద్యోగాన్ని, ఉపాధి వెతుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం శిక్షణ, ప్రిపరేషన్‌కు ఏళ్ల తరబడి సమయం కేటాయించే దుస్థితి తప్పుతుంది. తద్వారా విలువైన కాలం, సమయం ఆదా అవుతుంది. అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తారు కాబట్టి.. వివిధ రకాల పట్టభద్రులకు సమాన అవకాశాలు లభిస్తాయి.

ఏపీపీఎస్సీలో జాబ్‌ క్యాలెండర్‌ ఏళ్ల తరబడి ప్రతిపాదన దశలోనే ఉంది. తాము గొప్ప పరిపాలకులమని చెప్పుకునే వారు కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. సివిల్‌ పరీక్షలకు మాత్రమే యూపీఎస్పీ క్యాలెండర్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు విడుదల చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చేయలేనిది వైఎస్‌ జగన్‌ చేసి చూపారు. ఇది జగన్‌కు మాత్రమే ఎలా సాధ్యమైంది అంటే.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సగటు రాజకీయ నాయకుడు కాదు.

Also Read : పెట్రో కాంప్లెక్స్ పై జగన్ పట్టుదల