iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ హ‌స్తిన‌లో ఉండ‌గానే… ఏపీకి తీపి క‌బురు

జ‌గ‌న్ హ‌స్తిన‌లో ఉండ‌గానే… ఏపీకి తీపి క‌బురు

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఆల‌నా పాల‌నా చూడ‌డానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రారంభించారు. ప‌లు ప‌థ‌కాల ద్వారా నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లోనే న‌గ‌దు జ‌మ చేశారు. ఫ‌లితంగా క‌రువు కాలంలోనూ ఏ ఇబ్బందీ లేకుండా ఏపీవాసులు సంతోషంగా గ‌డుపుతున్నారు. ఇప్పుడు క్ర‌మంగా సాధార‌ణ జీవ‌నం ప్రారంభ‌మైంది. పాల‌న కూడా గాడిలో ప‌డుతోంది. దీంతో ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నెర‌వేర్చాల్సిన హామీల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫోన్ లు, లేఖ‌ల ద్వారా విన‌తులు పంపిన జ‌న‌గ్ నేరుగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లుస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తున్నారు.

షా దృష్టికి టీడీపీ కుంభ‌కోణాలు..

ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న షా ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి నిశితంగా సీఎం వివరించారు. ముఖ్యంగా.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానాలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిన‌ట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా.. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను కూడా సీఎం జగన్.. షా దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ అంశాలపై అమిత్ షాకు విజ్ఞాపన పత్రాన్ని జగన్ అందజేశారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. షాతో భేటీ అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. ఇవాళ రాత్రి జగన్ అక్కడే బస చేసి బుధవారం ఉదయం జగన్ ఏపీకి తిరుగుపయనం కానున్నారు.

శ్రీ‌కాకుళం జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం

జ‌గ‌న్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గానే ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి మంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి కోసం పాటుప‌డుతున్న ఏపీకి ఈ వార్త మ‌రింత‌ దోహ‌ద‌పడ‌నుంది. ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.