Idream media
Idream media
ఏపీలోని పేదలందరికీ గూడు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. విపత్కర పరిస్థితుల్లోనూ దానిపై దృష్టి పెట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగని జగన్.. ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ అదే సంకల్పంతో ఉన్నారు. కరోనాతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇళ్ల నిర్మాణాల ప్రారంభానికి కూడా అధికారులకు డెడ్ లైన్ విధించారు. 31 లక్షల ఇళ్లకు గాను మొదటి దశలో 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని లక్ష్యం ఏర్పరిచింది. అన్ని లే అవుట్లలోనూ ఈ నెల 31 నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని ఆదేశించారు. ఏమైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. కారణాలు, కుంటిసాకులు కుదరవని, గడువు లోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల్సిందేనని జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించింది. ప్రతిపక్షాల అడ్డంకులు, న్యాయస్థానాల్లో కేసుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడినప్పటికీ సీఎం జగన్ అన్నింటినీ అధిగమించి గతేడాదిలో డిసెంబర్ లోనే ఇళ్ల స్థలాలను అందించారు. స్థలాలతో పాటు ఇళ్లను కూడా తామే కట్టిస్తామని మరో వరం పేదలకు అందించింది. ఆ మేరకు వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన రెండు రకాల మోడల్ హౌస్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి ఆమోద ముద్ర వేశారు. పేదలకు కేటాయించే సెంటు స్థంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేపట్టేలా మోడల్ సిద్ధం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్రూమ్, కిచెన్, వరండాలతో నిర్మాణానికి అన్నీ సిద్ధం చేశారు. కరోనా కారణంగా ఇళ్ల నిర్మాణం ఆగకూడదని తాజాగా మరోసారి జగన్ దానిపై దృష్టి పెట్టారు.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద ‘వైఎస్సార్ – జగనన్న’ కాలనీల్లో వడివడిగా ఇళ్ల నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద ప్రభుత్వం రికార్డుస్థాయిలో దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. వీటిలో మొదటి దశలో 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని లే అవుట్లలో ఈ నెల 31 నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము, ఇతర ముడిసరుకు సరఫరా చేసేవారికి సకాలంలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది.
ప్రతివారం లబ్ధిదారులు, సరఫరాదారులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని జమ చేయనున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. మొదటి దశలో మంజూరైన 15,10,227 ఇళ్లకు సంబంధించి 12,61,928 ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తి చేశారు. దాదాపు 84% ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తయ్యింది. మిగిలింది ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. ఇక 7,81,430 ఇళ్ల స్థలాలకు అంటే దాదాపు 52% జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మిగిలిన వాటిని గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పేదల ఇళ్లపై జగన్ చూపుతున్న శ్రద్ధకు ప్రశంసలు అందుతున్నాయి.