Krishna Kowshik
Krishna Kowshik
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా. విజయదశమి వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది సెలవులు. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో.. స్వంత ఊళ్లో పండుగను జరుపుకునేందుకు ఉద్యోగాలకు లీవ్స్ తీసుకుని పయనమౌతుంటారు నగర వాసులు. ఈ క్రమంలో సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇటీవల పండుగలన్నీ తగులు మిగులు పద్ధతిలో రావడంతో ఎప్పుడు సెలవులు అన్న దానిపై క్లారిటీ ఉండటం లేదు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాయి ఆయా ప్రభుత్వాలు. ఇక ఉద్యోగుల సెలవుల విషయంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం సవరించగా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో విజయ దశమి సెలవుల్లో మార్పులు చేసింది జగన్ ప్రభుత్వం. తొలుత అక్టోబర్ 23వ తేదీన సోమవారం రోజున అధికారిక సెలవు దినంగా పేర్కొంది. కానీ ఇప్పుడు ఉద్యోగులకు శుభవార్త చెబుతూ సెలవులను సవరించింది. అక్టోబర్ 23, 24 అంటే సోమ, మంగళవారం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కార్. అంటే ఆదివారంతో కలిపి మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఏపీలో విద్యా సంస్థలకు 14 నుండి 24వ తేదీ వరకు దసరా సెలవులు యథావిధిగా కొనసాగనున్నాయి. 25వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి.