iDreamPost
android-app
ios-app

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు : ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు : ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ త‌ర్వాత ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట ఆన్‌లైన్‌/వ‌ర్చువ‌ల్. విద్యార్థుల క్లాసులైనా, రాజ‌కీయ పార్టీల‌ స‌మావేశాలైనా, మంత్రివ‌ర్గ భేటీలైనా అంతా ఆన్ లైన్ లోనే. వ‌ర్చువ‌ల్ విధానంలోనే కొన‌సాగేవి. కొన‌సాగుతున్నాయి కూడా. తెలుగుదేశం పార్టీకి అత్యంత పెద్ద పండుగ మ‌హానాడు కూడా రెండేళ్ల పాటు వ‌ర్చువల్ గానే కొన‌సాగింది. కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన జీహెచ్ ఎంసీ మేయ‌ర్ ఎన్నిక కూడా ఆన్ లైన్ లోనే జ‌రిగింది. కొంద‌రి కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకారం కూడా అంతే. గ‌త నెల 29న మొట్ట‌మొద‌టి గ్రేట‌ర్ కౌన్సిల్ మీటింగ్ కూడా వ‌ర్చువ‌ల్ గానే సాగింది. రూ. 5600 కోట్ల‌తో రూపొందించిన 2021-22 బ‌డ్జెట్ ను ఆన్ లైన్ లో జ‌రిగిన కౌన్సిల్ మీటింగ్ లోనే ఆమోదించారు కూడా.. ఇలా లోక‌ల్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌కు అన్ని పొలిటిక‌ల్ మీటింగ్ లు ఆన్ లైన్ లోనే జ‌రిగాయి. రాష్ట్ర, కేబినెట్ భేటీలు కూడా అలాగే కొన‌సాగాయి. దాదాపు ఏడాది త‌ర్వాత కేంద్ర మంత్రి మండ‌లి నేరుగా స‌మావేశం కావ‌డం, మంత్రులంద‌రూ ఒక‌చోట చేర‌డం ప్ర‌త్యేకంగా మారింది.

జూలై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి బుధవారంనాడు భేటీ అయ్యింది. చాలా రోజుల తర్వాత వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి బుధవారంనాడు భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధికారం నివాసంలో ఈ సమావేశం జరిగింది. వర్చువల్‌ తరహాలో కాకుండా ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అందరూ నేరుగా హాజరయ్యారు.

దాదాపు ఏడాది త‌ర్వాత కేంద్ర కేబినెట్ మీటింగ్ నేరుగా జరగడం ఇదే ప్రథమం. జూలై 7న మంత్రి వర్గ పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా సమావేశం కావడం కూడా ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం కేబినెట్ కమిటీలను పునర్వవస్థీకరించిన తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేశారు. కొత్త వారిని మంత్రులుగా ఎంచుకున్న కార‌ణాల‌ను, వారు వ్య‌వ‌హ‌రించాల్సిన తీరును వివ‌రించిన‌ట్లు తెలిసింది. ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చాల‌ని, క‌రోనా కాలంలో ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించాల‌ని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్ల‌లో క‌న‌బ‌రిచే ప‌నితీరును బ‌ట్టే మున్ముందు అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపిన‌ట్లు తెలిసింది. అలాగే, కోవిడ్‌పై పోరాటంలో ఎలాంటి అలసత్వం వద్దని మంత్రులకు ప్రధాని సూచించారు. కాగా, ఆగస్టు 13తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియ‌నున్నాయి.

Also Read : కాంగ్రెసులో చేరతారా.. కూటమిలో చేర్పిస్తారా! ఆసక్తికరంగా ప్రశాంత్ కిశోర్ అడుగులు