Idream media
Idream media
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్కు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆపన్నహస్తం అందించింది. ఆయన చికిత్స కోసం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. గత నెల 26వ తేదీన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తల, కంటిభాగంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
మేజర్ ఆపరేషన్లు అవసరం అవుతాయని ఆస్పత్రి వైద్యులు నిర్థారించడంతో.. అందుకు అవసరమైన ఖర్చును భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ సీఎం ప్రత్యేక అధికారి ఎం.హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.
సినీ విమర్శకుడుగా ఉన్న కత్తి మహేష్.. బిగ్బాస్ షోలోనూ పాల్గొన్నారు. దళితవాది కూడా అయిన కత్తి మహేష్.. హిందూ దేవుళ్లపై చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ నగర బహిష్కరణ ఎదుర్కొన్నారు. పలు సినిమాల్లోనూ కత్తి మహేష్ నటించారు. వర్తమాన రాజకీయాలపై కూడా తనదైన శైలిలో కత్తి మహేష్ కామెంట్ చేస్తుంటారు.
Also Read : చమురు మంటలకు కారణం ఎవరు??