Idream media
Idream media
పంచాయతీలు ఏకగ్రీవమైతే లొల్లి.. మున్సిపాలిటీలు ఏకగ్రీవమైతే లొల్లి.. ప్రజలు వైసీపీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ పార్టీ మద్దతుదారులను, అభ్యర్థులను గెలిపిస్తే ఆరోపణలు.. టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, అధికార దాహంతోనే ఇదంతా జరిగిందని వైసీపీపై విమర్శలతో పబ్బం గడుపుకునే టీడీపీ నేతల బరితెగింపు బయటపడింది. వైసీపీ అభ్యర్థిని దాచిపెట్టి, చివరి నిమిషంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే తన సొంత కారులోనే తీసుకొచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించడం సంచలనంగా మారింది. టీడీపీ నేతల దౌర్జన్యాకాండకు నిదర్శనంగా నిలిచింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సంగ్రామం మొదలైనప్పటి నుంచీ టీడీపీ రాజకీయాలు జుగుప్సాకరంగా మారుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాల్టీ ఎన్నికలు ఏవైనా అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టలేని స్థితికి ఆ పార్టీ చేరింది. ఈ క్రమంలో తమ పరువు కాపాడుకోవడానికి టీడీపీ నేతలు వింత వింత రాజకీయాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికలలో విజయాలన్నీ వైసీపీ అభ్యర్థులనే వరించాయి. చివరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీకి పరాభవమే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు అనగానే ఆ పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. మున్సిపాల్టీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతున్నారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ పలు చోట్ల దౌర్జన్యాలకు దిగుతోంది. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే బరి తెగించారు.
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ నలుగురిలోనూ చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి వైసీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జిల్లాలో 1011 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా తెలుగుదేశం కేవలం 155 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. అత్యధిక స్థానాల్లో టీడీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస పరాజయాలు, వైఫల్యాలు టీడీపీ ముఖ్య నేతలను అంతర్మథనంలో పడేశాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఆ పార్టీ నేతలు బెదిరింపులకు, కిడ్నాపులకు పాల్పడుతున్నారు.
అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని భయపెట్టి నామినేషన్ విత్ డ్రా చేయించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో పచ్చ నేతల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం నామినేషన్ విత్ డ్రాకు ఆఖరి రోజు కావడంతో మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. 8వ వార్డు నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు టీడీపీ నేతలు కూడా స్వచ్ఛందంగా తమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. అది జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. వైసీపీ అభ్యర్థిని ప్రలోభ పెట్టి దాచి పెట్టారు. ఆఖరు నిమిషంలో తన సొంత వాహనంలో అతడిని తీసుకొచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించారు.
దీంతో 8వ వార్డు బరిలో వైసీపీ తరుపున ఎవరూ పోటీలో లేకుండా పోయారు. ఎమ్మెల్యే తీరుతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గొట్టిపాటి తీరుపై వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి కృష్ణచారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8వ వార్డు ఉపసంహరణ చాలా దారుణమన్నారు. నామినేషన్ ఉప సంహరణకు వైసీపీ అభ్యర్థిని తెలుగుదేశం ఎమ్మెల్యే కారులో తీసుకు రావడాన్ని బట్టే ఎంత బరితెగింపుకు దిగారో అర్థం అవుతోందని అన్నారు. నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థిని దాచిపెట్టి, ఆశపెట్టి, భయపెట్టి నామినేషన్ విత్ డ్రా చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, టీడీపీ ఎమ్మెల్యే చర్యలపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి