నదిలో చిక్కుకున్న ప్రయాణికులతో ఉన్న బస్సు!

ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 53 మంది ప్రయాణికులతో ఉన్న ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు ఓ నదిలో చిక్కుకుపోయింది. స్థానికులు గమనించి వెంటనే ఓ జేసీబీని ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అందులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండో-నేపాల్ ఫ్రెండ్ షిప్ బస్సులో దాదాపు 53 మంది ప్రయాణికులు ఇటీవల హరిద్వార్ కు బయలుదేరారు.

అయితే వీరి ప్రయాణంలో భాగంగా యూపీలోని బిజ్నోర్ కు చేరుకోగానే వీరి బస్సు ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు కోటవాలి నదిలో చిక్కుకుపోయింది. దీంతో డ్రైవర్ బస్సును ఒడ్డుకు చేర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆ డ్రైవర్ శ్రమ ఫలించలేదు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు గమనించి ఓ జేసీబీ సాయంతో నదిలో చిక్కుకున్న 53 మంది ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు అంతా ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అక్కడ గత కొన్ని రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తుందని, దీని కారణంగానే ఈ ఊహించని ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే బస్సు నదిలో చిక్కుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Show comments