Madhapur Drugs Case: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో మరో కోణం.. అక్కడ వ్యభిచారం కూడా..

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో మరో కోణం.. అక్కడ వ్యభిచారం కూడా..

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. రేవ్‌ పార్టీ జరిగిన చోట డ్రగ్స్‌ దందాతో పాటు వ్యభిచారం కూడా జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. నిందితులు వెంకట్‌, బాలాజీలపై ఇది వరకే వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. పలు చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వెంకట్‌ డ్రగ్స్‌ సప్లైలో ప్రధాన సూత్రధారని తేలింది. వెంకట్‌తో పాటు బాలాజీ కూడా ఈ క్రైంలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పాడు పనుల కోసం వీరు రూము నెంబర్‌ 804ను అడ్డాగా చేసుకున్నట్లు తెలిసింది.

వారం లెక్కన సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. డ్రగ్స్‌తో పాటు అమ్మాయిలతో వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తేలింది. గతంలోనూ రెండు సార్లు ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, తాజా ఘటన జరిగిన సమయంలో వెంకట్‌ దగ్గరినుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 30 గ్రాముల ఎల్‌ఎస్‌టీ పిల్స్‌తో పాటు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. వెంకట్‌ గోవానుంచి డ్రగ్స్‌ తెప్పిస్తున్నాడని సమాచారం. వాటిని వాడటంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్‌ టీమ్‌ వెంకట్‌ కస్టమర్లు ఎవరన్నదానికి గురించి ఆరా తీస్తోంది.

విషయం వెలుగులోకి వచ్చిందిలా?

మాదాపూర్‌ విఠల్‌ రావు నగర్‌, ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్లో రేవ్‌ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారంతో పోలీసులు రూము నెంబర్‌ 804లో దాడులు నిర్వహించారు. సినిమా ఫైనాన్షియర్‌ వెంకట్‌, మురళి, బాలాజీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరి, మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments