Dharani
Dharani
కేంద్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం.. ఆర్థికంగా వారిని ఆదుకోవడం కోసం రకరకాల పథకాలు తీసుకువస్తుంది. కానీ వాటి గురించి సామాన్యులకు పెద్దగా తెలియదు. చాలా పథకాల గురించి ప్రభుత్వం కూడా ఎక్కడా ఎలాంటి ప్రకటనలు కూడా ఇవ్వదు. అలాంటి ఒక పథకం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాలో రూ.3 వేలు జమ చేస్తోంది. మరి ఇంతకు ఆ పథకం ఏంటి.. దానికి ఎలా అప్లై చేసుకోవాలి.. వంటి తదితర వివరాలు మీ కోసం.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తోన్న ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఎంతో కొంద ఆదాయం, ప్రతి నెల పెన్షన్గా ఎంతో కొంత మొత్తం పొందుతారు. కానీ అసంఘటిత రంగంలో పని చేసే వారికి మాత్రం ఆ అవకాశం ఉండదు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. అసంఘటిత రంగంలో పని చేస్తోన్న వారికి పెన్షన్ అందించడం కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ పథకంలో చేరారు. వీరికి 60 ఏళ్ల తర్వాత అంటే మెచ్యూరిటీ టెన్యూర్ తర్వాత ప్రతి నెలా పెన్షన్ రూపంలో రూ. 3 వేలు అందిస్తారు.
18-40 ఏళ్ల లోపు ఉండి.. అసంఘటిత రంగంలో పని చేస్తోన్న వారు.. దీనిలో చేరడానికి అర్హులు. వీరు ప్రతి నెల 55-200 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వారి నెల ఆదాయం 15 వేల రూపాయల కంటే తక్కువ ఉండి.. పీఎఫ్, ఎన్పీఎస్, ఈఎస్ఐసీ పరిధిలోకి రాని వారు దీనిలో చేరడానికి అర్హులు. అలానే ఆదాయ పన్ను పరిధిలోకి రాకూడదు. దీనిలో చేరిన లబ్ధిదారుడు అకాల మరణం చెందినట్లయితే వారి భాగస్వామి పెన్షన్గా 50 శాతం పొందుతారు.
ఈ పథకంలో చేరాలనుకునేవారు.. దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, జన్ధన్ ఖాతా, బ్యాంక్ పాస్బుక్, చెక్, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీ ఉండాలి. ఇంట్లో పని చేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రజకులు, రిక్షా కార్మికులు, భూమిలేని కార్మికులు, వ్యవసాయం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ, చేనేత, తోలు కార్మికులు ఇంకా ఇతర కార్మిక వృత్తుల వారు ఈ పథకానికి అర్హులవుతారు.