కాకినాడ తీరం: సముద్రంలో వేటకు వెళ్తోన్న బోటులో అగ్నిప్రమాదం

తీరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు. .

తీరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు. .

బంగాళఖాతం, కాకినాడ తీరంలో వేటకు వెళ్తోన్న బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బోటులో వంట చేసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే దీని గురించి కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 11 మంది మత్య్సకారులను కాపాడారు. గ్యాస్ సిలిండర్ పేలగానే.. బోటులో ఉన్న వారు సముద్రంలోకి దూకారని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరికి గాయాలు కాలేదు.

బంగాళఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే.. రోజుల తరబడి అటే ఉంటారు. అందుకే వారు తమతో పాటు వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్ వంటి వాటిని బోటులో తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బోటులో ఉన్న సిలిండర్ పేలడంతో ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

ఇక కొన్ని రోజుల క్రితమే విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 40కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అలానే నేడు అనగా శుక్రవారం నాడు కూడా హార్బర్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మరో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ హార్బర్ అగ్రిప్రమాద బాధితులను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే.

Show comments