రాష్ట్రంలో వైద్య సహాయం అందించడం, బాధితులను ఆస్పత్రికి తరలించడంలో 108 అంబులెన్సులు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంబులెన్సుల సర్వీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 108 సేవలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందుకే ఇప్పుడు ఉన్న అంబులెన్సులకు అధనంగా మరో 146 కొత్త అంబులెన్సులను నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
2020లోనే మండలానికి ఒక అంబులెన్సు చొప్పున ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.34.79 కోట్ల వ్యయంతో 146 కొత్త అంబులెన్సులను కొనుగోలు చేశారు. 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ చర్యలతో గతంతో పోలిస్తే 108 అంబులెన్సు సేవలు ఎంతో మెరుగయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు రోజుకు 3,089 కేసుల చొప్పున అటెండ్ అవుతున్నాయి. 2020లో రూ.96.50 కోట్లు ఖర్చుచేసి 412 అంబులెన్సులు కొనుగోలు చేశారు. దెబ్బతిన్న కొన్నింటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.
గత అక్టోబర్ లో గిరిజన ప్రాంతాల వారి కోసం రూ.4.76 కోట్లతో అదనంగా 20 అంబులెన్సులను కొనుగోలు చేశారు. ఇలా 2020 జులై నుంచి ఇప్పటివరకు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 33,35,670 ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి 108 అంబులెన్సులు సేవలందించాయి. అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల సమయంలో, ఎమర్జెన్సీ కేసులలో ఈ అంబులెన్సులు కీలకపాత్ర పోషించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.