iDreamPost

దేశం పేరు మార్చాలన్న పిటిషన్‌పై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు 

దేశం పేరు మార్చాలన్న పిటిషన్‌పై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు 

ఇండియా పేరును భారత్‌ లేదా హిందుస్థాన్ అని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ సాగింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉందని పిటిషనర్‌కు చెప్పారు. ఈ విషయంలో కావాలనుకుంటే కేంద్రం వద్దకు వెళ్లాలని సూచించారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు పిటిషన్ పంపవచ్చని సూచన చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించారు.

ఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్ అని మార్చడం వల్ల ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయ భావం పెంపొందుతాయని ఢిల్లీకి చెందిన పిటిషనర్ తన పిటిషన్‌లో వివరించారు. దేశం పేరు మార్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు.

ఇండియా అనేది ఆంగ్ల పదమని, స్వదేశీ భాషలో పెడితే దేశ ప్రజలకే గర్వకారణంగా ఉంటుందని పిటిషనర్ సూచించారు. 1948లోనూ భారత్ లేదా హిందూస్థాన్‌లో ఏదో ఒక పేరు పెట్టాలనే వాదన వచ్చిందని పిటిషనర్ గుర్తు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి