iDreamPost

మళ్ళీ ‘కొత్త’ భయాలు

మళ్ళీ ‘కొత్త’ భయాలు

కోవిడ్‌ 19 నెమ్మదిస్తోందన్న వార్తను జనం పూర్తిగా ఆనందించేలోపే రూపు మార్చుకుని ఈ సారి బ్రిటన నుంచి కొత్త రూపంలో ముంపు ముంచుకొస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం కరోనా వైరస్‌కు ఉండే స్పైక్‌లో మార్పులు చోటు చేసుకున్నారు. దీంతో ఇది మునుపటి కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అంటే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన కోవిడ్‌ వ్యాప్తితో పోలిస్తే దాదాపు డెబ్బైశాతం ఎక్కువగా దీని వ్యాప్తి రేటు ఉందని విదేశీ వైద్యనిపుణుల వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. ఇక్కడ కాస్తంత ఊరడింపు ఏంటంటే మరణాల విషయంలో గత వైరస్‌ మాదిరిగానే ఇది కూడా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదింకా ప్రయోగస్థాయిలో ఉంది. పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు.

అయితే ఈ లోపు బ్రిటన్‌ నుంచి వివిధ దేశాలకు చేరుకున్న వారి వివరాలు గుర్తించే పనిలో ఆయా దేశాల్లోని వైద్య, నిఘా వర్గాలు తలమునకలైపోయాయి. నిజానికి గతంలో కోవిడ్‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామేమోనన్న సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేసారు. అయితే ఈ సారి వైరస్‌లో వచ్చిన కొత్త మార్పు కారణంగా అత్యంత బీకరమైన వేగంతో వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రమాదం విషయంలో ఒకేలా ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండడమే ఇప్పుడు వైద్య రంగాన్ని ఆందోళన పరుస్తోంది. అంటే గతంలొ పాజిటివ్‌లు వంద ఉంటే, ఇప్పుడు దానికంటే డెబ్బైరెట్లు ఉంటాయన్న మాట. దీన్ని బట్టి వైద్య రంగం ఏ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొవాల్సి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చును.

బ్రిటన్‌ నుంచి ముంబైకి, కర్నాటకకు, అమృత్‌సర్, అహ్మదాబాద్, కోల్‌కత్తాలకు దాదాపు 1350 మంది వరకు వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్‌ లెక్కలను బట్టి తెలుస్తోంది. వీరిలో అహ్మదాబాద్‌కు వచ్చిన వారిలో నాలుగురికి, కోల్‌కత్తాకు వచ్చిన వారిలో ఇద్దరికి, అమృత్‌సర్‌కు వచ్చిన వారిలో ఒకరికి కోవిడ్‌ సోకినట్లు చెబుతున్నారు. అయితే ఇది సాధారణ కోవిడ్‌ లేదా మార్పు చెందిన కోవిడ్‌ అనేది ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నవంబర 25– డిసెంబర్‌ 23 మధ్య యూకేలో పర్యటించిన వారంతా పరీక్షలు చేయించుకోవాని సూచించింది. ఈ మేరకు వివరాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగానికి పంపిస్తోంది. కాగా తెలంగాణాలో ఈ విధంగా యూకే నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా గుర్తించారు. కానీ ఆ వైరస్‌ పాదతా? కొత్తదా? అన్నది తేలడానికి పుణెల్యాబ్‌కు పంపించినట్లు చెబుతున్నారు.

పరీక్షా విధానాలనే మార్చాలా..

కోవిడ్‌ వైరస్‌లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న పరీక్షల విధానాన్ని కూడా మార్చాల్సి ఉంటుందన్న అభిప్రాయం పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పరీక్షలు బ్రిటన్‌ వైరస్‌ను గుర్తించే అవకాశం లేదని వారు వివరిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి వచ్చిన వారికి నెగటివ్‌ వచ్చినప్పటికీ, క్వారంటైన్‌ విషయంలో ఖచ్చితత్వం తప్పదన్నమాట. ఇక్కడ ఎటువంటి నిర్లక్ష్యం వహించినా భారీ ముల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తతమే ముఖ్యం..

అబ్బే.. కోవిడ్‌ తగ్గిపోయింది.. పెద్దగా ప్రభావం లేదంటగా.. ఇటువంటి ప్రేలాపనలకు ఇప్పుడు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. అత్యంత వేగంగా వ్యాపిస్తోందన్నది ఇప్పటికే బ్రిటన్‌లో స్పష్టమైపోయింది. దీంతో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు. ఎవరికి వారు భూతిక దూరాన్ని పాటించడం, మాస్కు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, జన సమూహాలకు దూరంగా ఉండడం వంటివి చేయాల్సింది సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి