iDreamPost

భార్యని చంపి.. చెరువులో పడేసి.. సాఫ్ట్‌‍వేర్ ఇంజనీర్ ఘాతుకం..

భార్యని చంపి.. చెరువులో పడేసి.. సాఫ్ట్‌‍వేర్ ఇంజనీర్ ఘాతుకం..

ఓ సాఫ్ట్‌‍వేర్ ఇంజనీర్ తన భార్యని చంపేసి చెరువులో పడేసి అయిదు నెలలు ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేసిన సంఘటన అందర్నీ షాక్ కి గురిచేసింది. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్ కి వివాహం అయింది. కొన్ని రోజులు కాపురం బాగానే జరిగినా వివాహమైన నాలుగు నెలల నుంచి పద్మను చిత్ర హింసలకు గురిచేశాడు ఆమె భర్త.

వేణుగోపాల్‌ వేధింపులు భరించలేక పద‍్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు కోరింది. అనంతరం దిశ పోలీస్‌స్టేషన్‌లో వేణుగోపాల్‌పై పద్మ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వేణుగోపాల్‌, అతడి కుటుంబసభ్యులను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కాపురం బాగానే సాగినా వీరిద్దరి మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయి. వేణుగోపాల్‌ పద్మపై తన శాడిజాన్ని చూపించాడు. దేంతో మళ్ళీ పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సారి వేణు వెళ్లి అత్తమామలకు నచ్చజెప్పి భార్యను మళ్లీ తన ఇంటికి తీసుకొచ్చాడు.

అయితే జనవరి 5న పద్మను చంపేసి సూట్‌కేసులో పెట్టి తిరుపతి శివారులోని వెంకటాపురం చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తన జాబ్ కోసం హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. జనవరి నుంచి పద్మ తనతోనే ఉన్నట్లు అత్తమామలను నమ్మించాడు. అయితే ఐదు నెలలుగా తమ కుమార్తెతో మాట్లాడనివ్వట్లేదని అనుమానమొచ్చి పద్మ తల్లిదండ్రులు తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు నిమిత్తం హైదరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌ను పోలీసులు పిలిపించి విచారించగా తానే హత్య చేసి చెరువులో పడేసినట్లు తెలిపాడు. దీంతో పద్మ కుటుంబ సభ్యులు షాక్ కి గురయి భోరుమన్నారు. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ సూట్ కేసుని బయటకి తీపించారు. అది ఓపెన్ చేయగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం వేణుగోపాల్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పద్మ ఇలా మరణించిందని తెలియడంతో ఆమె ఇంట్లో, బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి