iDreamPost

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు.. 129 ఆధారాలతో దొరికిన లోకేష్‌

  • Published Sep 29, 2023 | 1:15 PMUpdated Sep 29, 2023 | 1:15 PM
  • Published Sep 29, 2023 | 1:15 PMUpdated Sep 29, 2023 | 1:15 PM
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు.. 129 ఆధారాలతో దొరికిన లోకేష్‌

టీడీపీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో.. నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రధాన ప్రాతధారులని సీఐడీ తెలిపింది. ఈ కేసులో చంద్రబాబుని ఏ1గా చేర్చగా.. లోకేశ్‌ను ఏ14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో సీఐడీ పేర్కొంది. ఇన్నర్‌ రింగ్ రోడ్‌ అలైన్‌మెంట్‌ పేరిట చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని.. దీని ద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ నిర్ధారించింది.

129 ఆధారాలతో దొరికిన లోకేశ్‌..

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సిట్‌ అధికారులు లోకేశ్‌ పాత్రకు సంబంధించి.. 129 కీలకమైన ఆధారాలను గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాటిలో సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్‌ సందేశాలు, మ్యాపులతోపాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్‌ అధికారులు ఈ సందర్భంగా నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి కొందరు కీలక అధికారులు.. నాడు తాము రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించి అభ్యంతరం తెలిపామని.. కానీ వాటిని బేఖాతరు చేసి మరీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఖరారు చేశారని సీఐడీకి తెలిపారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగానే ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈమెయిళ్లు పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌దే కీలక పాత్ర అని సిట్‌ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

లింగమనేనితో క్విడ్‌ ప్రోకో.. హెరిటేజ్‌కు భూములు

లింగమనేనితో క్రిడ్‌ ప్రో కోకి పాల్పడి.. హెరిటేజ్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. అంతేకాక అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్పించారని సీఐడీ గుర్తించింది. లింగమనేని రమేశ్‌ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములను ఆనుకొని ఐఆర్‌ఆర్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

క్విడ్‌ప్రోకో కింద లింగమనేని రమేశ్‌ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ తెలిసింది. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్‌ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. దాంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాక ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు అప్లై చేసిన నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయడమే కాక.. విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి