iDreamPost

కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి చేసిన పనికి

  • Published Apr 08, 2024 | 3:09 PMUpdated Apr 08, 2024 | 3:09 PM

Rajanna Sircilla: కుమార్తె తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. దాంతో ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

Rajanna Sircilla: కుమార్తె తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. దాంతో ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

  • Published Apr 08, 2024 | 3:09 PMUpdated Apr 08, 2024 | 3:09 PM
కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి చేసిన పనికి

కన్నబిడ్డలపై తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమానురాగాలుంటాయి. కడుపున పుట్టిన బిడ్డలను కళ్లల్లో పెట్టి చూసుకుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా.. తల్లిదండ్రులు బాధతో విలవిల్లాడతారు. నిరంతరం పిల్లల క్షేమం కోసమే ఆరాటపడతారు. వారి బంగారు భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని అర్పిస్తారు. అలాంటి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా.. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో.. కొందరు తప్పటడుగులు వేస్తుంటారు. వద్దని తల్లిదండ్రులు మందలిస్తే.. వారిని కాదనుకుని.. ఇంటి నుంచి వెళ్లి పోయి మరీ పెళ్లి చేసుకుంటారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. కన్నవారిని కాదనుకుని ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుమార్తె చేసిన పనికి ఆవేదనతో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

ప్రాణంగా పెంచిన కుమార్తె.. చిన్న వయసులోనే ప్రేమ పేరుతో ఆకర్షణకి లోనయ్యంది. విషయం తెలుసుకున్న తండ్రి వద్దని వారించాడు. కానీ ఆమె వినలేదు. తండ్రిని కాదనుకుని.. వెళ్లి ప్రియుడిని వివాహం చేసుకుంది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి.. తన కుమార్తె మరణించిందంటూ ఫ్లెక్సీ వేయించాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన చిలువేరు మురళి కుమార్తె అనూష.. బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో  అనూష ఓ యువకుడిని ప్రేమించింది. విషయం కాస్త తండ్రికి తెలియడంతో ఆయన వారించాడు. ఈవయసులో ఇలాంటి పనులు సరికాదని హెచ్చరించాడు. బుద్దిగా చదువుకోవాలని సూచించాడు. కానీ అనూష మాత్రం తండ్రి మాటలను పెడచెవిన పెట్టింది. అంతేకాక తామిద్దరిని విడదీస్తారేమో అనే భయంతో.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. తండ్రికి ఇష్టం లేని వివాహం చేసుకుంది.

పుట్టిన నాటి నుంచి కళ్లల్లో పెట్టుకుని చూసిన బిడ్డ చేసిన పనికి ఆ తండ్రి గుండె పగిలిపోయింది. అడిగిందల్లా ఇచ్చి అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఇలా గుండెల మీద తన్నివెళ్లిపోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అనూష తండ్రి.. తన కన్నబిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించాడు. అంతేకాక బంధువులందరిని పిలిచి.. బిడ్డకు పిండం పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా అనూష తండ్రి మాట్లాడుతూ.. ’’అమ్మలారా.. అయ్యలారా.. నా బిడ్డ వెళ్లిపోయింది. మంచి కాలేజీలో చదువుతోన్న మా అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ కాళ్లు మొక్కుతా‘‘ అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు. అనూష తండ్రి ఆవేదన చూసిన వారు.. ఆమె చర్యల్ని ఖండిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి