iDreamPost

మూగజీవాల తిండికి రూ.54 లక్షలు.. మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి

మూగజీవాల తిండికి రూ.54 లక్షలు.. మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి

కరోనా వైరస్‌తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడంతో మూగ జీవాలకు తిండిలేకుండా పోయింది. టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు ఆఖరున పడేసే పదార్థాలు తింటూ బతికే వీధి కుక్కులు, పిల్లులు ఇప్పుడు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాయి. వాటిని ఆకలిని తీర్చేందుకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 54 లక్షల రూపాయలు విడుదల చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ వీధి కుక్కలు, పిల్లలకు ఆ నిధులతో ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నిధలు విడుదల చేసి మానవత్వం చాటుకున్నారు మఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌.

పారదర్శకత, అవినీతి రహిత, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ ఒరిస్సా ప్రజల మనస్సులను చూరగొన్న బ్రహ్మచారి నవీన్‌పట్నాయక్‌ తాజా నిర్ణయంతో దేశ ప్రజలు, జంతు ప్రేమికులు అభిమానాన్ని పొందారు. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఐదు కార్పొరేషన్లు, 48 మున్సిపాలిటీల్లోని మూగజీవాలకు ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. కార్పొరేషన్‌కు 20 వేల రూపాయలు, మున్సిపాలిటీ విస్తీర్ణం ఆధారంగా 10 వేల నుంచి ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి రోజు ఆయా మున్సిపాలిటీలు వీధి జీవాల ఆహారం కోసం ఖర్చు చేయవచ్చు.

ప్రజలు మెచ్చే నిర్ణయాలతో పాలన సాగించే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రచారానికి దూరంగా ఉంటారు. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. హుద్‌హుద్‌ తుఫాను సృష్టించిన భీభత్సం గురించి ఏపీ ప్రజలకు కూడా తెలుసు. విశాఖ చిగురుటాకులా వణికింది. అసలు హుద్‌హుద్‌ ప్రభావం అధికంగా ఒడిస్సాపై పడింది. తుఫాను హెచ్చరికలతో ఆ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో చెట్ల కొమ్ములు నరికించారు. ఫలితంగా చెట్టు కూలిపోలేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం నివారించారు. ఒక చిన్న రాష్ట్రం ఇంత పెద్ద తుఫానును విజయవంతంగా ఎదుర్కొవడంపై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది.

అదే సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో విశాఖలో చేసిన హడావుడిని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఇప్పటికీ ఆయన హుద్‌హుద్‌ సమయంలో తాను చేసిన పోరాటాన్ని చెప్పుకుంటుంటారు. ప్రజలకు మంచి చేస్తే వారి మన్ననలు ఎల్లప్పుడూ ఉంటాయనే విషయం నవీన్‌ పట్నాయక్‌ను చూసి తెలుసుకోవచ్చు. మళ్లీ మళ్లీ సీఎం అవ్వాలంటే మీడియా మద్ధతు అవసరం లేదు, అంగ, ఆర్థిక బలం అవసరంలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి