వన్డే వరల్డ్ కప్ సంగ్రామం మరికొద్ది సేపట్లో మొదలుకానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ స్టార్ట్ అవ్వనుంది. భారత జట్టు ఈసారి ఎన్నో ఆశలతో ప్రపంచ కప్కు రెడీ అవుతోంది. సొంత గడ్డపై కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేస్తూ కప్పును కైవసం చేసుకోవాలని కోరుకుంటోంది. అయితే 45 రోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘ టోర్నీలో టైటిల్ను గెలుచుకోవడం అంత ఈజీ కాదు. కలసికట్టుగా రాణిస్తేనే విజేతగా నిలవొచ్చు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో టీమిండియా విజయావకాశాలు, ఏయే ప్లేయర్లు కీలకమనే విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ కప్లో ఫైనల్ ఎలెవన్ను ఎంచుకోవడం అన్ని టీమ్స్కు పెద్ద సవాల్గా నిలుస్తుందని రవిశాస్త్రి అన్నాడు. టీమిండియా కూడా ఈ సమస్యను ఎదుర్కోక తప్పదన్నాడు. టీమ్ కోసం ప్రతి ఆటగాడు ఎప్పుడూ రెడీగా ఉండాలన్నాడు రవిశాస్త్రి. భారత బ్యాటింగ్లో మిగతా వాళ్లతో పాటు సూర్యకుమార్ యాదవ్ రాణించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. చాన్నాళ్లుగా సూర్యను గమనిస్తున్నానని.. ఈ వరల్డ్ కప్లో భారత జట్టుకు అతడే ఎక్స్ ఫ్యాక్టర్ అని రవిశాస్త్రి తెలిపాడు. సూర్య మ్యాచ్ విన్నర్ అని.. బిగ్ మ్యాచెస్లో టీమ్ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతడికి ఉందన్నాడు.
‘సూర్యకుమార్ చివరి 5 నుంచి 7 ఓవర్లు క్రీజులో ఉంటే చాలు. హార్దిక్తో కలసి అతడు విధ్వంసం సృష్టించగలడు. చూస్తూ ఉండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. కాబట్టి ఫ్లాట్ పిచ్లు ఉంటే సూర్యను పక్కాగా టీమ్లోకి తీసుకోవాలి. శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ పెద్ద మ్యాచుల్లో లోవర్ ఆర్డర్లో సూర్య టీమ్లో ఉండాలి. అతడు ఆడితే అదనపు బలం చేకూరుతుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. బౌలింగ్లో భీకర ఫామ్లో ఉన్న కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో ప్లేస్ దొరకడం కష్టమేనన్నాడు. అపోజిషన్ టీమ్లో లెఫ్టాండర్లు ఉంటే అశ్విన్ జట్టులోకి వస్తాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. తొలి మ్యాచ్లో గెలుపు ఎవరిదంటే?