ఈ రోజు భారతీయ జనతా పార్టీ తమ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కార్యవర్గంలో తెలుగువారికి అందులో ముఖ్యంగా తెలంగాణ వారికి పెద్ద పీట వేయడం ఆసక్తికరంగా మారింది. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా తెలంగాణ కీలక నేత-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అలాగే మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావులకు చోటు లభించింది. ఆఫీస్ బేరర్ గా జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు ఛాన్స్ దక్కగా ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి ఈటెల రాజేందర్ లకు కూడా స్థానం లభించింది. ఇక ఈ కార్యవర్గ ప్రకటనతో తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తోంది అనేదాని మీద స్పష్టమైన సూచనలు వచ్చినట్లే.
ఇక మొదటి నుంచి సముచిత స్థానం లేదు అని భావిస్తున్న ఈటలకు సముచిత స్థానం కల్పించగా పార్టీ మారిపోతారు అంటూ ప్రచారం జరిగిన వివేక్ వెంకటస్వామికి కూడా కీలక స్థానం అప్పచెప్పడంతో ఆ ప్రచారం అంతా ఒట్టిదేనని ఆయనను బీజేపీ ఎంతగా నమ్మింది అనే విషయం మీద సంకేతాలు వచ్చినట్లయింది. ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : యడ్యూరప్ప సన్నిహితులపై ఐటీ దాడుల వెనుక ఆంతర్యమేమిటీ..?
తండ్రి వెంకటస్వామి వారసుడిగా 2019లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విభేదించి తెలంగాణకు మద్దతుగా నిలిచారు. 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా ఆయన ప్రకటన చేశారు. కానీ ఎందుకో మనసు మార్చుకుని కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి స్థానానికి ఎంపీగా పోటీ చేయగా అక్కడ నుంచి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. కొన్నాళ్లపాటు కాంగ్రెస్ లోనే ఉన్న ఆయన తర్వాత టీఆర్ఎస్ లో చేరగా ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు కేసీఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందని భావించగా రాలేదు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా టికెట్ వస్తుంది భావించగా అప్పుడు కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
దీంతో తర్వాత బిజెపిలో చేరిన ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ మాజీ నేతలందరూ పార్టీలో చేరుతున్నారనే ప్రచారాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకు వచ్చింది. వారి వ్యూహాలు ఫలించి కొంత మంది చేరారు కూడా. అదే సమయంలో వివేక్ వెంకటస్వామి కూడా చేరిపోతున్నారు అనే ప్రచారం జరగగా ఆయన అప్పట్లో ఫిర్యాదులు కూడా చేశారు. సాధారణంగా ఇలా పార్టీలు మారుతున్నారు అని ప్రచారం జరిగిన నేతలను ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కానీ వివేక్ వెంకటస్వామి విషయంలో వచ్చినవన్నీ బూటకపు వార్తలే అని బీజేపీ అధిష్టానానికి తెలియడంతో ఆయనకు జాతీయ కార్యవర్గంలో కూడా కీలక స్థానం లభించింది. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివేక్ వెంకటస్వామి మంచిర్యాల లేదా పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : మేనక, వరుణ్ గాంధీ లను బీజేపీ ఎందుకు దూరం పెట్టింది..?