iDreamPost
android-app
ios-app

కరోనాలోనూ అగ్రరాజ్యమే టాప్‌

కరోనాలోనూ అగ్రరాజ్యమే టాప్‌

ఆర్థిక, సైనిక రంగాల్లో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లోనూ తొలి స్థానంలో నిలిచింది. ఆ దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా వైరస్‌ సోకిన వారి సంఖ్యలో అమెరికాలో 85 వేలు దాటిందని హెల్త్‌ బులిటెన్‌ వెల్లడించింది. 1300 మంది మరణించారని తెలిపింది. వైరస్‌ వెలుగు చూసిన చైనా 81,340 కేసులు నమోదయ్యాయి. 80,589 పాజిటివ్‌ కేసులతో ఇటలీ మూడో స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. 198 దేశాలకు కరోనా పాకింది. చైనాలోని వ్యూహాన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్‌ రోజులు వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసింది.

ఇటలీ తరహాలోనే అమెరికా కూడా నిర్లక్ష్యంగా ఉండడంతోనే కరోనా వైరస్‌ విజృంభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు షట్‌డౌన్‌ చేయాలన్న నిపుణుల సూచనను అగ్రరాజ్య అధినేత ట్రంప్‌ పెడచెవినపెట్టారు. షట్‌డౌన్‌ చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలుతుందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒత్తిడిలు, డిమాండ్లు వచ్చినా ట్రంప్‌ షడ్‌టౌన్‌ దిశగా ఆలోచన చేయడంలేదు. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి మరింత దిగజారకముందే ట్రంప్‌ షట్‌డౌన్‌ చేస్తారా..? లేదా..? అనేది ఒకట్రెండు రోజుల్లో తెలుతుంది. మరోవైపు అమెరికాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ తెలుగు వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఇతర దేశాలకు భిన్నంగా భారత్‌దేశం ఆలోచించిందని చెప్పవచ్చు. కరోనా పాజిటివ్‌ కేసులు మూడు వందలు దాటక ముందే 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌ దేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్‌లో ఉంచాయి. పోలీసులు, వైద్యులు ఉదయం, సాయంత్రం వెళ్లి వారిని పరీక్షిస్తున్నారు. అందుకే ఇతర దేశాల్లో వేలల్లో కేసుల నమోదవుతుండగా భారత్‌లో ఇప్పటికి 724 కేసులు మాత్రమే నమోదవడం భారత్‌ ముందు జాగ్రత్తకు నిదర్శనంగా నిలుస్తోంది.