iDreamPost
android-app
ios-app

బలం లేకపోయినా పినరయిపై అవిశ్వాసం.. యూడీఎఫ్‌ లక్ష్యం అదేనా..?

బలం లేకపోయినా పినరయిపై అవిశ్వాసం.. యూడీఎఫ్‌ లక్ష్యం అదేనా..?

కేరళలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్న గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం తిరిగి తిరిగి సీఎం పినరయి విజయన్‌కు చుట్టుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీ విభాగంలో ప్రతినిధిగా ఉన్న స్వప్న సురేష్‌ అనే మహిళ గోల్డ్‌ స్మగ్లింగ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉండడంతో పినరయి ప్రభుత్వంపై విమర్శల దాడిపెరిగింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపడుతోంది. ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌తోపాటు పలువురును ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది.

అయినా కేరళ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు ఆగడంలేదు. ముఖ్య అధికారులను పినరయి ప్రభుత్వ కాపాడుతోందని, ప్రభుత్వంలో పలువురికి ఈ స్మగ్లింగ్‌తో సంబంధం ఉందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) సీఎం పనరయి విజయన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. తాజాగా ఈ రోజు ప్రతిపక్ష యూడీఎఫ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం పినరయి విజయన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆయనతోపాటు స్పీకర్‌ పి.రామకృష్ణన్‌పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో నిందితుడుగా ఉన్నారని, ప్రభుత్వలోని పలువురుకు ఈ అక్రమ వ్యవహారంలో సంబంధం ఉందని యూడీఎఫ్‌ ఆరోపిస్తోంది.

ప్రతిపక్షం ప్రవేశపెట్టదల్చుకున్న అవిశ్వాస తీర్మానం వల్ల లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేకపోయినా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పావులు కదుపుతోంది. 140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు 91 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 47 సీట్ల బలం ఉంది. బీజేపీకి ఒకటి, మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నారు. ప్రభుత్వం కొనసాగేందుకు సాధారణ మెజారిటీ 71 సీట్లు కన్నా ఎల్‌డీఎఫ్‌కు అదనంగా 20 ఎమ్మెల్యేల బలం ఉంది. ఎల్‌డీఎఫ్‌లో సీపీఎంకు 58 సీట్లు, సీపీఐకు 19 సీట్లు ఉండగా.. మిగతా 14 సీట్లు 9 పార్టీలకు ఉన్నాయి. ఇక యూడీఎఫ్‌లో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌కు 22 సీట్లు, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌)కు 18 సీట్లు ఉండగా,, మిగతా 7 సీట్లు రెండు పార్టీలకు ఉన్నాయి.

అయితే గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష యూడీఎఫ్‌ వ్యూహం రచిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పాందాలనే లక్ష్యంతో యూడీఎఫ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వాన్ని పడగొట్టే బలం లేకున్నా.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించిందన్న ప్రచారం సాగుతోంది. అవిశ్వాస తీర్మానం ద్వారా ఎల్‌డీఎఫ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా అసెంబ్లీలో చర్చ చేసేందుకు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం ప్రతిపక్ష యూడీఎఫ్‌కు ఒక ఆయుధంగా దొరికిందని చెప్పవచ్చు. కేవలం పది నెలల వ్యవధిలో జరగబోయే కేరళ శాసన సభ ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చిన ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం ఎల్‌డీఎఫ్‌కు నష్టం చేకూర్చే అవకాశాలు భారీగానే ఉన్నాయి.