iDreamPost
android-app
ios-app

కామెడీగా మారిన చంద్ర‌బాబు సీరియ‌స్ దీక్ష‌

కామెడీగా మారిన చంద్ర‌బాబు సీరియ‌స్ దీక్ష‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు చాలా రోజుల త‌ర్వాత ఆన్ లైన్ ను వ‌దిలి నేరుగా ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. అదే సాధ‌న దీక్ష‌. క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు అంటూ క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో ఈ దీక్ష చేప‌ట్ట‌డం ఓ ఎత్త‌యితే, చేప‌ట్టిన విధానం, చేసిన స‌మ‌యం మ‌రో ఎత్తుగా మారింది.

175 నియోజకవర్గాల్లోను దీక్షలు చేయాలని చెప్పిన చంద్రబాబు తాను మాత్రం కుప్పంకు వెళ్ళకుండా పార్టీ సెంట్రల్ ఆఫీసులోనే దీక్ష చేశారు. మంగళవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు దీక్ష చేశారు. చంద్ర‌బాబు సీరియ‌స్ గా దీక్ష చేసినా దానిపై కామెడీలు ట్రోల్ అవుతున్నాయి.

సాధ‌న దీక్ష కోసం చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటలకు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో దీక్ష ప్రారంభించారు. మధ్యాహ్నం 1 ప్రాంతంలో దీక్షను ముగించేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకనే ఉదయం టిఫిన్ తినేసి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ భోజనం సమయానికి దీక్షను ముగించుకుని వెళ్ళిపోయారంటూ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. వైసీపీ మంత్రులు, నేత‌లు కూడా దీనిపై త‌మ‌దైన స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుస్తున్నారు. ఈమధ్య చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడుతున్నారో ? ఏపని ఎందుకు చేస్తున్నారో కూడా తెలీకుండానే చేసేస్తున్నాంటూ విమ‌ర్శిస్తున్నారు.

దీక్ష ప్రారంభానికి ముందు మాట్లాడిన చంద్ర‌బాబు ప్ర‌సంగం ఆద్యంతం కూడా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషించేందుకే ప్ర‌య‌త్నించారు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌లిగేలా ఆక‌ట్టుకోలేక పోయారు. క‌రోనా క‌ట్ట‌డిలో ప్రభుత్వం ఫెయిలైందని ఆరోపించటం తప్ప అందుకు స‌హేతుక‌మైన కార‌ణాల‌ను చెప్ప‌లేక‌పోయారు. ఏడాదిన్న‌రగా పెద్ద‌గా బ‌య‌ట‌కు రాని టీడీపీ అధినేత స‌హ పార్టీ శ్రేణులు ప్రజలకు భరోసా క‌ల్పించార‌ని చెప్పుకోవ‌డం కూడా కామెడీగా మారింది.

ప్ర‌చారానికి ప్ర‌యారిటీ ఇవ్వ‌కుండా క‌రోనా క‌ట్ట‌డికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ అధికారుల‌ను, ఉరుకులు పెట్టిస్తున్న జ‌గ‌న్ ఆ విష‌యాల‌ను ప్రెస్ మీట్లు పెట్టి బ‌హిరంగంగా ఎందుకు చెప్ప‌రంటూ ప్ర‌శ్నించ‌డం కూడా విచిత్రంగా అనిపించింది. ప‌నులు చేసుకుంటూ పోవ‌డ‌మే కాకుండా, ప్ర‌చారం చేసుకోవ‌డంపై జ‌గ‌న్ మొద‌టి నుంచీ దృష్టి పెట్ట‌డం లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అదే స‌మ‌యంలో బాబు హ‌యాంలో ప్ర‌చార హోరు కూడా తెలిసిన విష‌య‌మే. జ‌గ‌న్ కూడా అలాగే చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తుండ‌డం నిజంగా హ్యాస్యాస్ప‌ద‌మే.

అందుకే బాబు దీక్ష‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. ఉదయం టిపిన్ మధ్యాహ్న భోజనం మధ్యలో సుమారు 3 గంటలపాటు దీక్ష చేయటం చంద్రబాబుకు చెల్లిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.