iDreamPost
iDreamPost
ఏదైనా ఒక మంచిపని చేయాలంటే అనేకానేక ఇబ్బందులు దెరొడ్డాల్సి ఉంటుంది. ఇందుకు ఏపీలో మద్యనిషేధాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తానని ఏపీ సీయం జగన్ ప్రకటించారు. అందులో భాగంగానే షాపులను తగ్గించడం, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడం, మద్యం ధరలు పెంచడం వంటివి చేపట్టారు. మద్య నిషేధం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం బాగుపడంతోపాటు, వారి ఆర్ధిక పరిస్థితి, సమాజంలో వారి స్థితి కూడా మెరుగువుతుంది. ఈ నేపథ్యంలో మద్యనిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కానీ దీనికి తూట్లు పొడిచే విధంగా సరిహద్దులోని రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని మన రాష్ట్రంలోకి తెచ్చేందుకు కొందరు అక్రమార్కులు సిద్దమైపోయారు. ఇందుకోసం వీరు అనుసరిస్తున్న టెక్నిక్లు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయనే చెప్పాలి. ఒంటికి చుట్టూ బాటిల్స్ చుట్టుకోవడం, మోటారు సైకిల్ డూమ్లో సీసాలు పెట్టుకోవడం, అరటిగెల మాదిరిగా మద్యంను ప్యాక్చేయడం, కార్లలో రహస్యంగా తీసుకురావడం తదితర చర్యలు పాల్పడుతున్నారు.
అయితే పరిస్థితిని గమనించి జగన్ సర్కార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ బృందం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ లక్షలాది రూపాయల విలువైన మద్యాన్ని, వాటి రవాణా వెనుక ఉన్న అక్రమార్కులను పట్టుకుంటున్నారు. అంతరాష్ట్రా రహదారుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే మద్యంతోపాటు, రాష్ట్రంలోనే అక్రమంగా తయారు చేసే సారాపై కూడా ఎస్ఈబీ బృందం దృష్టి పెట్టింది.
దీంతో అక్రమంగా వచ్చిపడే మద్యాన్ని అడ్డుకట్ట వేస్తున్నారు. రవాణా దారులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. అంతే కాకుండా డీ ఆడిక్షన్ కేంద్రాల ద్వారా మద్యం అలవాటు మాన్పించడానికి కూడా కృషిచేస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సమావేశాల నిర్వహించిన ప్రజలను మద్యానికి వ్యతిరేకంగా చైతన్య పరుస్తున్నారు. ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన మద్యంను దూరం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విజయవంతమవ్వాలని పలువురు కోరుకుంటున్నారు.