రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.50 కోట్లు ఆపై వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని కంపెనీలు వినియోగదారులకు రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 1, 2020 కల్లా ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని.. లేనిపక్షంలో ఆయా కంపెనీలకు రోజుకు రూ.ఐదు వేల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎండీఆర్ను ఎత్తివేస్తున్నట్లు శనివారం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచే అమల్లోకి రానుంది. డిజిటల్ మార్గంలో వినియోగదార్ల నుంచి చెల్లింపులను స్వీకరించినందుకు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే రుసుమునే ఎండీఆర్గా వ్యవహరిస్తారు. తాజా నిర్ణయంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. కాకపోతే బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీలు ఆ మేరకు ఆదాయం కోల్పోనున్నాయి. కాగా కేంద్రం నిర్ణయంపై పేమెంట్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం.