iDreamPost
android-app
ios-app

పార్టీ నేత‌ల‌న్నా త‌ర‌లి వ‌స్తారా..?

పార్టీ నేత‌ల‌న్నా త‌ర‌లి వ‌స్తారా..?

“రైతన్నా… నేటి నా గొంతులో ఆవేదన, రేపటి నీ బతుకులో వాస్తవం… అందుకే… రేపటి వరకు వద్దు… ఈ రోజే చరిత మార్చేద్దాం రా… తరలిరా.. రావిరాలకు”… అంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు ఏర్పాట్లు శారు. కానీ ఆ పార్టీలోనే ఆ యాత్ర‌పైన‌, స‌భ‌పైన భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనికి కాంగ్రెస్ సీనియర్లు ఎవ్వరూ హాజరుకాకూడదని ఇఫ్పుడు డిసైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని, ఎవ్వరూ హాజరు కావద్దని కాంగ్రెస్ నేతలకు లోపాయకారీ సందేశాలు వెళ్లినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు,. కాంగ్రెస్ అధిష్టానం తరపున కూడా ఎవ్వరూ హాజరుకాకుండా చూడాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

రేవంత్ పాదయాత్రపై పార్టీ సీనియర్లతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాలోచనలు చేశార‌ని, మంగళవారం రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లొద్దని సీనియర్ల నిర్ణయం తీసుకున్నార‌ని స‌మాచారం. రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి లేదని, అయితే తమ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేసుకోమని అధిష్ఠానం చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. రేవంత్‌రెడ్డి తన పార్లమెంట్ పరిధి కాకుండా… ఇతరుల నియోజకవర్గాల్లో ఎలా పాదయాత్ర చేస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ పాదయాత్ర ముగింపు సభకు రావొద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌పై సీనియర్ల ఒత్తిడి తెస్తున్నారని ఆ పార్టీ శ్రేణలు చెబుతున్నాయి. రేపు రావిరాలలో రేవంత్ సభకు ఎవరు హాజరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతు భరోసా దీక్ష చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షకు కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే దీక్ష ముగించే సమయంలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కసారిగా తన దీక్షను పాదయాత్రగా మార్చుకున్నారు. అయితే ఈ పాదయాత్ర రేపటితో ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం రావిరాలలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా యాత్ర ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3 గంటలకు రావిరాలలో ముగియనుందని, ఆనాడు జరిగే రణభేరికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తా రావాలని ఆయన కోరారు. సభలో అందరూ పాల్గొని మోదీ, కేసీఆర్ కుమ్మక్కును ఛేదించాలన్నారు. “రైతన్నా… నేటి నా గొంతులో ఆవేదన, రేపటి నీ బతుకులో వాస్తవం… అందుకే… రేపటి వరకు వద్దు… ఈ రోజే చరిత మార్చేద్దాం రా… తరలిరా.. రావిరాలకు”… అంటూ రేవంత్ ట్వీట్ చేశారు