iDreamPost
iDreamPost
జైలు నుంచి విడుదలయిన తర్వాత అర్ణబ్ గోస్వామి తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. నేరుగా తన టీవీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడారు. దానిని కూడా ఆయన చానెల్ లైవ్ లో ప్రసారం చేసింది. ఆసందర్భంగా తాను కొత్తగా వివిధ భాషల్లో టీవీ చానెళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లిక్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో న్యూస్ చానెల్ గా ఉంది. వివిధ ప్రాంతీయ భాషల్లో అడుగుపెట్టబోతున్నట్టు స్పష్టమయ్యింది. వాస్తవానికి ఏడాది కాలంలో రిపబ్లిక్ తెలుగు లో కూడా అడుగుపెట్టే ఆలోచనతో ఉంది. మధ్యలో కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో కొంత జాప్యం జరిగింది. తాజాగా అర్ణబ్ అరెస్ట్ తర్వాత మారిన పరిస్థితుల్లో తాను పట్టు నిలుపుకోవడం కోసం కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు భావింవచ్చు. ముఖ్యంగా ఉద్దవ్ ఠాక్రేతో తగాదా కారణంగా మరాఠీతో మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక రిపబ్లిక్ తెలుగు టీవీ వస్తే దానిలో హవా కోసం పలువురు పెద్ద తలకాయలు కాచుకుని కూర్చున్నారు. ఇప్పటికే చుండూరు సాయి కోసం కొందరు ఆర్ఎస్ఎస్ పెద్దలు లాబీయింగ్ చేసే అవకాశం ఉంది. సంఘీయులతో సన్నిహితంగా ఉండే సాయి తగిన వ్యక్తిగా వారంతా ప్రతిపాదిస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో టీవీ9 రజనీకాంత్ కూడా గతంలో ఆశాభావంతో కనిపించారు. కానీ టీవీ9లో అంతర్గతంగా మారిన పరిస్థితులతో ఆయన సేఫ్ జోన్ లో ఉన్నట్టు భావిస్తున్నారు. టీవీ9 మేనేజ్ మెంట్ తో వచ్చిన తగాదాలతో త్వరలోనే రజనీకాంత్ ని సాగనంపుతున్నారనే కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ చివరకు రజనీకాంత్ కొనసాగుతుండగా సీఓఓగా వచ్చిన గొట్టిపాటి సింగారావు సెలవు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ కి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఆయన టీవీ9 దాటి బయటకు అడుగుపెట్టే అవకాశం లేదని ప్రచారం.
టీవీ5 మూర్తి కూడా రిపబ్లిక్ వంటి నేషనల్ నెట్ వర్క్ లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పవచ్చు. స్థానిక వ్యవహారాల్లో స్వేచ్ఛగా సాగేందుకు నేషనల్ చానెల్ తోడ్పడుతుందని, స్థానికంగా తానే బాస్ గా ఉండవచ్చని ఆయన భావిస్తున్నారని సమాచారం. టీవీ5లోనూ, అంతకుముందు ఏబీఎన్ లోనూ పనిచేసిన సమయంలో ఆయా యాజమాన్యాల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతున్న చరిత్ర ఆయనది. అదే సమయంలో వివిధ పీఠాధిపతులు, మతాధిపతులతో సన్నిహిత సంబంధాలున్నాయి. సామాజిక కోణంలో కూడా కలిసివచ్చే అవకాశం ఉందని అంచనా. దాంతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకొందరు బాసులు బలమైన ప్రయత్నాలు చేస్తున్నా ఈ ముగ్గురిలో ఒక్కరికి అవకాశం దక్కవచ్చని సమాచారం.
అదే సమయంలో రిపబ్లిక్ టీవీ9 ని తెలంగాణా కోసం హైదరాబాద్ కేంద్రంగా చానెల్ నడుపుతూ ఏపీ కోసం విశాఖలో ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. దాంతో అర్ణబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరమే. తెలుగులో అర్ణబ్ మాదిరిగా స్టూడియోలలో కూర్చుని గట్టిగా అరవాలనే ప్రయత్నం చేసిన కొందరు యాంకర్లు అభాసుపాలయ్యారు. ఇప్పుడు అర్ణబ్ నేతృత్వంలోనే చానెల్ వస్తే ఇంకెంతగా రెచ్చిపోతారన్నది చూడాలి.