iDreamPost
iDreamPost
దిశ నిందితుల ఎన్కౌంటర్ తో దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయా ?
ఇకపై రేపులు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ?
మద్యపానం ఒక్కటే మానభంగాలకు కారణమా ?
అత్యాచారం చేస్తే స్త్రీని శారీరకంగా మానసికంగా హింసించి,ఆమె కుటుంబాన్ని జీవితాంతం కుమిలిపోయేలా చేయడం అలాంటి క్రూరమైన నేరాలకు కారకులు ఎవరు ?
తల్లి తండ్రులు ,సమాజం,న్యాయ వ్యవస్థ ,హక్కుల సంఘాలు , సినిమాలు, మీడియా కారకులు కారా ?
దిశ ఘటన దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కఠిన మనసత్త్వం కలిగిన వారిని సైతం కదిలించింది. ప్రజలందరూ నిందితులను ఎన్కౌంటర్ చేయాలని ముక్త కంఠంతో కోరారు. నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం విచారణ పేరుతొ సంవత్సరాల తరబడి చికెన్ మటన్ లతో భోజనాలు పెట్టొద్దని, తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. అయితే పోలీసులు చట్టప్రకారం అరెస్ట్ చేసి నిన్న కోర్ట్ ద్వారా కస్టడీకి తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ తెల్లవారుజామున నిందితుల ఎన్కౌంటర్ వార్తతో దేశ ప్రజలు నిద్ర లేచారు.కోరుకున్నది జరగడంతో సంతోషంతో సంఘటన స్థలం వద్ద పోలీసులపై పూలవర్షం కురిపించారు.
ఇక పోలీసుల విషయానికి వస్తే “ఊరుకి ఒక్కడే రౌడీ ఉండాలి అది పోలీసోడై ఉండాలి “అన్న సినిమా డైలాగుని రియల్ డైలాగు చేసి చూపించారు .సైబరాబాద్ పోలీస్ కమిషనర్ V.C. సజ్జనార్ దిశా హత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసి జేజేలు అందుకున్నారు.గతంలో వరంగల్ లో కూడా ఆసిడ్ దాడి నిందితులను ఎన్కౌంటర్ చేసింది సజ్జనార్ కావడం విశేషం.
ఈ ఎన్కౌంటర్లతో అత్యాచారాలు ఆగుతాయా?
వరంగల్ లో యువతులపై ఆసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన తరువాత కూడా ఆసిడ్ దాడులు మాత్రమే కాదు వివిధ సంఘటనలలో మహిళలను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి సజీవ దహనాలు కూడా చేసారు .
వరంగల్ ఎన్కౌంటర్ తరువాత ఎందుకు అత్యాచారాలు ఆసిడ్ దాడులు ఎందుకు అగలేదు?
దిశా అత్యాచారానికి నిందితులు మద్యం మత్తులో ఉండటమే కారణం అనుకున్నా, గతంలో మద్యపానం నిషేధం ఉన్న సమయంలో అత్యాచారాలు జరగలేదా ? సంపూర్ణ మద్యపానం నిషేధం ఉన్న రాష్ట్రాలలో అత్యాచారాలు జరగడం లేదా ? జరుగుతూనే ఉన్నాయి పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మద్యం తక్కువ ధరకు దొరికే విదేశీ సంస్కృతి ఎక్కువగా ఉండే గోవా లాంటి రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు అత్యాచారాల సంఖ్య తక్కువే అన్నది గమనార్హం. మరి అత్యాచారాలు ఆగకపోవడానికి కారణాలు ఏంటి?
ముందుగా తల్లిదండ్రులు :
1) పిల్లలు చిన్నతనం నుండి గారాబంగా పెంచడం ,మితిమీరిన అల్లరి చేస్తున్నపుడు అదుపు చేయకపోవడం .
2) పిల్లలు చేసే చెడు స్నేహాలను గుర్తించక పోవడం , పిల్లల ముందు తల్లితండ్రులు కొట్టుకోవడం, వాళ్ళ ముందు ధూమ,మద్యపానం చేయడం, అంతే కాకుండా వాళ్ళతో సిగరెట్లు మందు తెప్పించుకోవడం,పిల్లల ముందు రొమాన్స్ చేయడం, పిల్లలు దారి తప్పడానికి ఒక విధంగా మనమే కారకులు అవుతున్నాం.
3) భార్యాభర్తలు విడిపోయిన కుటుంబంలో కూడా పిల్లలకు నియంత్రణ ఉండదు అంటున్నారు మానసిక నిపుణులు .
4) మొక్కై వంగని వాడు మానైన తరువాత వంగుతాడా అన్న సామెతని నిజం చేస్తున్నారు పిల్లలు .
సమాజం, న్యాయ వ్యవస్థ :
కొంతమంది చిన్ననాటి నుండి చెడిపోవడానికి మరొక కారణం సమాజం అంటున్నారు మానసిక వైద్యులు. చుట్టూ చెడు స్నేహం,ఆర్థిక అసమానతలు వల్ల, పిల్లలో నేర స్వభావం మొదలవుతుంది. దాంతో తమని ఎదిరించేవారు వారు ఎవరు ఉండరు అన్న భావనతో నేరాల బాట వైపు నడుస్తుంటారు. అందుకు కారణం మన న్యాయ వ్యవస్థ అంటున్నారు మరి కొంతమంది నిపుణులు.
ఎంత పెద్ద నేరం చేసిన బెయిల్ పై బైటకు రావడం, శిక్షలు ఖరారు కావడనికి దీర్ఘకాలిక సమయం తీసుకోవడంతో, నేరం నుండి తప్పించుకోవచు అన్న భావన కొందరిలో బలంగా ఏర్పడుతుంది .
హక్కుల సంఘాలు :
కొన్ని సార్లు నేరస్థుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టిన , పబ్లిక్ ప్లేస్ లో పనిష్మెంట్ ఇచ్చిన హక్కుల సంఘాలు పోలీస్ ల చర్యను ఖండిస్తాయి . అలాంటి శిక్షలు విధించిన పోలీసుల పై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాయి .దాంతో పోలీస్ బాస్ లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నా సిబంది పై చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పోలీసులు సైతం నిందితుల పట్ల సున్నితంగా వ్యవహరించవలసి వస్తుంది.
ఉదాహరణకు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవ్ టీజింగ్ కేసులో పోలీసులు ఆ యువకుడ్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు . అతడు చేసిన నేరం ఒప్పుకున్నాడు పోలీసులు కేసు బుక్ చేస్తాం అంటే ఆ అమ్మాయి నిరాకరించింది కేసు వద్దు కోర్ట్ కి రాను వాడిని న ముందు బెదిరించండి చాలు ఇంకోసారి నా వైపు చూడకుండా చేయండి అంది. దాంతో పోలీసులు ఆ యువకుడిని యువతీ ముందు బెదిరించి రెండు పీకారు ఆ సన్నివేశాన్ని వీడియో తీసిన యువకుడి మిత్రుడు దాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేసాడు . దాంతో ఆ పోలీస్ ను సస్పెండ్ చేయాలంటూ హక్కుల సంఘాలు డిమాండ్ చేయడం , నెటిజన్లు పోలీసుల పై విమర్శలు చేయడంతో పోలీస్ బాస్ అతన్ని సస్పెండ్ చేసారు . ఈ కేసు లో తప్పు ఎవరిదీ ?
బాధితురాలు మాట విన్న పోలీసులదా ? హక్కుల సంఘాలదా ? విమర్శకులదా ?పోలీస్ బాస్ దా ?
మరొక కేసులో అర్ధరాత్రి తప్ప తాగి రోడ్ల పై చిందులు వేస్తున్న యువకుడిని నచ్చచెప్పి పంపారు పోలీసులు. ఒక గంట తరువాత కూడా DJ లు పెట్టి న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈసారి ఆ యువకులు పోలీసులపై దాడి చేయగా పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పారు. మొత్తం సంఘటనను కాకుండా కేవలం లాఠీలతో కొడుతున్న వీడియోను మాత్రమే ఆ యువకులు వారికి దన్నుగా ఉండే నాయకులకు పంపారు. తమ పార్టీ కార్యకర్తల పై పోలీసులు దౌర్జన్యం చేస్తారా అంటూ అధికార పార్టీ నాయకులూ పోలీస్ బాస్ కు ఫోన్ చేయడం వెంటనే వారి బదిలీ జరిగిపోయింది .ఇందులో తప్పు ఎవరిదో మీరే ఊహించుకోండి.
సినిమాలు సీరియల్స్ సోషల్ మీడియా :
ఇక సినిమాలు ఎంత వినోదం ఇస్తున్నాయో అంతే చెడు మార్గం వైపు వెళ్ళడానికి కారణం అవుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. సినిమాలో మంచిని గ్రహించని కొంతమంది చెడుని మాత్రమే గ్రహించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. శంకరాభరణం లాంటి సినిమాలు చూసి సంగీత ప్రియులు కాకపోయినా పర్వాలేదు కానీ , వాయిలెన్స్ సినిమాలు చూసి చెడిపోతున్నారు . అలాగే సీరియల్స్ ,వంటగదిలో అత్తను చంపిన కోడలు ,బెడ్ రూమ్ లో మంచంపై భర్త,మంచం క్రింద ప్రియుడు.,ప్రియుడి తో కలిసి భర్తను హత్య చేసి అతని స్థానం లో పేస్ మేకింగ్ చేసి ప్రియుడిని తీసుకొచ్చిన సంఘటన సినిమా ప్రభావంతోనేనని నిందితురాలు విచారణలో చెప్పింది.
మీడియా
ఒకపుడు విలువల తో కూడిన వార్తలు అందించిన పత్రికలూ మీడియా పోటీ ప్రపంచంలో కొన్ని సంస్థలు దారి తప్పాయి అంటున్నారు నిపుణులు,వార్తను తొందరగా అందించాలి అన్న తపన తో అడ్డదారులు తొక్కుతూ అసత్య వార్తలు, అశ్లీలదృశ్యాలు ప్రచురించడం,
ప్రసారం చేయడమే కాకుండా డిబేట్ లు రూపంతో హింస పెరగడానికి మరొక కారణంగా మారుతుంది అంటున్నారు మానసిక నిపుణులు .
సోషల్ మీడియా :
ప్రతి ఒక్కరు తన గింతు వినిపించుకోవడనికి సోషల్ మీడియా ప్లాటుఫామ్ ఎంచుకుంటున్నారు . అంతవరకు బాగానే ఉంటుంది మానసిక పరిక్వత లేని వారు అసాంఘిక శకుతులు సోషల్ మీడియా లోకి ప్రవేశించడం , అశ్లీల దృశ్యాలు భయంకర దృశ్యాలు పోస్ట్ చేయడం దాన్ని వైరల్ చేయడం హింసకు మరొక కారణం . వాటి అన్నిటిని నియంత్రిస్తే కొంతమేర అత్యాచార ఘటనలు తగ్గుతాయని మానసిక నిపుణుల అభిప్రాయం.
చివరగా తల్లితండ్రులకి న విన్నపం :
పిల్లలను చిన్నప్పటి నుండి బాధ్యతగా పెంచండి ముఖ్యంగా పిల్లల అలవాట్లపై దృష్టి సారించండి.పిల్లల స్నేహితులను కూడా గమనిస్తుండాలి. తల్లిదండ్రుల మధ్య విబేధాలతో , ఆర్థిక కష్టాలతోనో , మరో కారణంతోనో మీ కొడుకులని కంట్రోల్ చేయకపోతే వారు ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉంది. ఆ నేర తీవ్రతను బట్టి పోలీసులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తారు. ఏ తల్లిదండులు పిల్లల్ని కోల్పోయి కడుపుకోతకి గురి కాకూడదు.
వాడిని కన్నాను కానీ వాడి కర్మను నేను కనలేదు అనుకొన్న తల్లితండ్రులకి ముఖ్యంగా …….
మురళీధర్ బలివాడ
జర్నలిస్ట్