iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్లో మీడియాకు సంకెళ్లు అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్న, సీనియర్ సంపాదకులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే రామచంద్రమూర్తి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా నిరాధారమైన, తప్పుడు వార్తల రాసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ప్రతిపక్షాలు వక్రీకరించడాన్ని రామచంద్రమూర్తి తప్పుబట్టారు.
శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు అవాస్తవాలు రాయడం సరికాదన్నారు. ఆధారాలు లేని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు వార్తలు రాసినప్పుడు వాటిని ఖండించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. తాము రాసిన వార్తలకు.. రిజాయిండర్ను(ప్రతిస్పందన) కూడా ప్రచురిండం లేదని అన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణంకాదని.. చట్టవిరుద్ధం అసలేకాదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే జీవో జారీ చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదన్నారు. సమాజానికి మేలు చేయడానికికే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని తెలిపారు.