iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ వడివడిగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరితో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ–క్రాప్ ఆధారంగా పంట కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంలేదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతులకు చెల్లింపు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,277 మంది రైతులు ధాన్యం విక్రయించగా 1,977 మందికి తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా నగదు జమ చేశారు. గతేడాది రూ.8,868 కోట్లతో 47.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం 50 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికి ఆయా జిల్లాల్లోని 123 మండలాల పరిధిలో 774 రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రూ.189.62 కోట్ల విలువైన 98 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
కోతలకు తుఫాను అడ్డంకి..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు వారాల కిందటే కోతలు ప్రారంభించాల్సి ఉండగా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో రైతులు సాహసించడం లేదు. వర్షాల కారణంగా కోస్తాలోని కొన్ని మండలాల్లో కోతలు నిలిపివేశారు. రాయలసీమ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అయితే.. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17లోపు ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వర్షాలతో కళ్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఇటు కోతకు వచ్చిన పంట తడిసింది. ఆర్బీకేల వద్ద శాంపిళ్లను పరీక్షిస్తే తేమ శాతం 22కు పైగా ఉంటోంది. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు నిబంధనలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు
రైతులకు గిట్టబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం 13 జిల్లాలలోని 6,884 ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. తేమ శాతం పేరుతో మధ్యవర్తులు, దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా కళ్లాల్లోనే నమూనాలు సేకరించి ఆర్బీకేల్లో పరిశీలించేలా ఏర్పాట్లు చేసింది. గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.1,960, సాధారణ రకం క్వింటాకు రూ.1,940 అందిస్తోంది. ఆధార్ అనుసంధానంతో ధాన్యం విక్రయించిన 72 గంటల నుంచి 21 రోజుల్లో చెల్లింపులు పూర్తిచేస్తోంది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. ధాన్యం రవాణాకు 84.60 లక్షల గోతాలను అధికారులు అందుబాటులో ఉంచారు.
Also Read : OTS నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి… బాబుకు దొంగ ప్రేమెందుకో?